గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్.. 120 కిలోల సరుకు స్వాధీనం

గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్.. 120 కిలోల సరుకు స్వాధీనం

గండిపేట, వెలుగు: గంజాయి అమ్ముతున్న ముగ్గురిని రాజేంద్రనగర్ ఎస్​వోటీ, మోకిల పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ డీసీపీ ఆఫీసులో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఘట్​కేసర్​లోని జగదాంబ థియేటర్ ప్రాంతానికి చెందిన శ్రీకాంత్(25) కారు డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. గంజాయిని బెంగళూరుకు తరలించేందుకు తమిళనాడుకు చెందిన ప్రేమ్ కుమార్(36), జాన్(26)తో శ్రీకాంత్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.

 గత నెల 31న వెంకీ అనే వ్యక్తిని కలిసి రూ.500కు కిలో చొప్పున 120 కిలోల గంజాయిని కొన్నాడు. మంగళవారం రాత్రి 2 కార్లలో గంజాయితో శ్రీకాంత్, ప్రేమ్ కుమార్, జాన్ ముగ్గురు బెంగళూరుకు బయలుదేరారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్​వోటీ, మోకిల పోలీసులు ఓఆర్ఆర్​పై నిఘా పెట్టారు. 2 కార్లను అడ్డుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 120 కిలోల గంజాయి, కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్​కు తరలించారు.