
బెంగళూరు చినస్వామి స్టేడయం దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ డీఎన్ఎ ఎంటర్ టైన్ మెంట్ నెటవర్క్స్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఆర్సీబీ హైకోర్టును ఆశ్రయించింది. తమపై నమోదైన కేసును రద్దు చేయాలని పిటిషన్ వేశాయి.
రాష్ట్ర పోలీసుల వైఫల్యాల వల్లే ఈ సంఘటన జరిగిందని, ర్యాలీకి పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసమూహాన్ని పోలీసులు నియంత్రించలేకపోయారని ఆరోపిస్తూ DNA ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన పిటిషన్లో పేర్కొంది. స్టేడియంలో తగినంత మంది పోలీసులు లేరని తెలిపింది. ప్రభుత్వ లోపాలను కప్పిపుచ్చుకునేందుకే DNA ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ను కేసులో ఇరికించారని తెలిపింది. కర్ణాటక ప్రభుత్వ అధికారిక ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమం జరిగిందని, ప్రధాన కార్యదర్శి స్వయంగా సన్నాహాలను పర్యవేక్షించారని కూడా పిటిషన్ లో తెలిపింది ఆర్సీబీ యాజమాన్యం.
తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్సీబీ మేనేజ్మెంట్, కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ), ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్పై కబ్బన్ పార్క్ పోలీసులు జూన్ 5న సుమోటోగా కేసు నమోదు చేశారు. క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసులో ఈ సంస్థలను నిందితులుగా పేర్కొంటూ భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని 5 వేర్వేరు సెక్షన్లతో పాటు సెక్షన్ 105 కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం, విక్టరీ పరేడ్ విషయంలో ఆర్సీబీ మేనేజ్మెంట్, కేఎస్సీఏ మొండిగా వ్యవహరించినట్లు పోలీసులు వివరించారు. ఈ క్రమంలో ఆర్సీబీ హైకోర్టును ఆశ్రయించారు.