
బెంగళూరు: ఐపీఎల్ సీజన్-18లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కప్ కల నెరవేరింది. దీంతో.. ఆర్సీబీ జట్టును ఘనంగా సత్కరించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. బెంగళూరు విధాన సౌధ నుంచి చినస్వామి స్టేడియం వరకూ బస్ పరేడ్ నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ పోలీసులు ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించారు. దీంతో.. విజయోత్సవ ర్యాలీ లేకుండానే చిన స్వామి స్టేడియానికి ఆర్సీబీ ఆటగాళ్లు చేరుకోనున్నారు. అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, ఒక కిలో మీటర్ వరకూ ఆ జనసందోహాన్ని నియంత్రించడం పెద్ద ఛాలెంజ్ అని పోలీసులు పరేడ్కు అనుమతి నిరాకరించారు. పార్కింగ్ సదుపాయం పరిమితంగా ఉన్నందు వల్ల విక్టరీ పరేడ్ లేదని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
— ಬೆಂಗಳೂರು ಸಂಚಾರ ಪೊಲೀಸ್ BengaluruTrafficPolice (@blrcitytraffic) June 4, 2025
ఆర్సీబీ టీంకు చిన స్వామి స్టేడియంలో సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య సత్కార కార్యక్రమం ఉందని.. అందువల్ల.. విధానసౌధ, చినస్వామి స్టేడియం సమీపంలోని రోడ్లపైకి సాయంత్రం 3 నుంచి 8 గంటల మధ్యలో రాకుండా ఉండాలని బెంగళూరు పబ్లిక్కు ట్రాఫిక్ పోలీసులు సూచించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆర్సీబీ జట్టును రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్ పోర్ట్కు వెళ్లారు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ మెగా లీగ్లో కొత్త చాంపియన్గా అవతరించి 18 ఏళ్ల కలను నిజం చేసుకున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన18వ సీజన్ మెగా ఫైనల్లో ఆర్సీబీ 6 రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించి టైటిల్ ఖాతాలో వేసుకుంది. హోరాహోరీ పోరులో తొలుత ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 190/9 స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (35 బాల్స్లో 3 ఫోర్లతో 43) టాప్ స్కోరర్గా నిలిచాడు. రజత్ పటీదార్ (16 బాల్స్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 26), లియామ్ లివింగ్స్టోన్ (15 బాల్స్లో 2 సిక్సర్లతో 25), జితేష్ శర్మ (10 బాల్స్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24) వేగంగా ఆడారు.
పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ (3/40), కైల్ జెమీసన్ (3/48) చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్లో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 184/7 స్కోరు చేసి ఓడింది. శశాంక్ సింగ్ (30 బాల్స్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 61 నాటౌట్) ఒంటరి పోరాటం వృథా అయింది. ఆర్సీబీ బౌలర్లలో క్రునాల్ (2/17), భువనేశ్వర్ కుమార్ (2/38) చెరో రెండు వికెట్లతో రాణించారు.