నీళ్లు, నిధులపేరుతో కేసీఆర్ కోట్ల అవినీతికి పాల్పడ్డారని.. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. సోనియా గాంధీ ఆమోదిస్తే వచ్చే ఏడాది ఏఐసీసీ ఫ్లీనరీ సమావేశాలను హైదరాబాద్లో నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికార టీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు చేశారు. కేసీఆర్,బండి సంజయ్ల ప్రెస్మీట్లు కల్లు కాంపౌండ్లను తలపిస్తున్నాయన్నారు. బండి సంజయ్ను కేసీఆర్ 6 ముక్కలు చేస్తా అన్నా..అరవింద్, బండి సంజయ్ ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ చర్చలో లేకుండా ఉండేందుకు బీజేపీ, టీఆర్ఎస్లు పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాయన్నారు.
కేసీఆర్ అవినీతిని బయటపెట్టే ధైర్యం మాకుందన్నారు రేవంత్. అమిత్షా అపాయింట్మెంట్ బండి సంజయ్కు ఇప్పిస్తారా అని ప్రశ్నించారు. మోడీ, అమిత్షా లకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. కిషన్ రెడ్డికి నేను సవాల్ చేస్తున్నా ..మీరు సీబీఐ ఎంక్వరీ వేయండి, కేసీఆర్ అవినీతిని నేను నిరూపించకుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. పవర్ ప్రాజెక్టులలో కేసీఆర్ వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడితే.. మంత్రులు ఇసుక మాఫియా చేస్తున్నారని అన్నారు.