
టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ టీమిండియా బ్యాటర్ ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జిల్లా ప్రాథమిక విద్యా అధికారి (BSA)గా నియమిస్తున్నట్టు తెలుస్తుంది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుండి రింకూ ప్రభుత్వ నియామకాన్ని పొందడం జరిగింది. అంతర్జాతీయ అథ్లెట్లకు ప్రభుత్వ సేవలలో పదవులు కల్పించి వారిని గౌరవించాలని యూపీ గవర్నమెంట్ భావించడం విశేషం. ఇంటర్నేషనల్ మెడల్ విన్నర్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ రూల్స్-2022 ప్రకారం రింకూని ఈ పదవి కోసం ఎంపిక చేశారు.
ఇటీవలే సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ తో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత, రింకు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుండి ప్రభుత్వ నియామకాన్ని పొందడం విశేషం. 9 వ తరగతి వరకే చదుకవుకున్న రింకూకు ప్రాథమిక విద్యా అధికారి బాధ్యతలు ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం రింకూ టీమిండియా తరపున టీ20 ఫార్మాట్ లో మాత్రమే ఆడుతున్నాడు. ఇటీవలే ఐపీఎల్ 2025లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన రింకూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఓవరాల్ గా 59 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 1,099 పరుగులు చేశాడు. టీమిండియా తరపున రెండు వన్డేలు.. 33 టీ20 మ్యాచ్ లు ఆడాడు.
ప్రాథమిక విద్యా అధికారి ఏమి చేస్తారు?
జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించే బాధ్యత ప్రాథమిక విద్యా అధికారికి ఉంటుంది. సిబ్బందిని నిర్వహించడం, విద్యా కార్యక్రమాల పనులను సజావుగా జరిగేలా చూస్తారు. నాణ్యతా ప్రమాణాలను నిర్వహించడానికి పాఠశాలలను తనిఖీ చేసే అధికారం ఉంటుంది. రాష్ట్రంలో అట్టడుగు స్థాయి విద్యను రూపొందించడంలో BSA కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యేక నిబంధనల కింద నియమితుడైన రింకు సింగ్ ఇప్పుడు తన క్రికెట్ కెరీర్తో పాటు విద్యా వ్యవస్థకు కూడా తోడ్పడతాడు.