
ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన తడాఖా చూపిస్తున్నాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో వరుస సెంచరీలతో దుమ్ములేపాడు. లీడ్స్ టెస్ట్ రెండు ఇన్నింగ్స్ ల్లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్ లో 118 పరుగులు చేసి సంచలనంగా మారాడు. ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓడిపోయినా తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. పంత్ ఇంగ్లాండ్ తో జరగబోయే రెండో టెస్టులో సెంచరీ దిగ్గజాలు బ్రాడ్మన్, ద్రవిడ్, లారా సరసన చేరనున్నాడు. ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇంగ్లాండ్ లో పంత్ వరుసగా రెండు టెస్టుల్లో సెంచరీలు చేశాడు. చివరిసారిగా 2022 లో టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటించినప్పుడు చివరి టెస్టులో పంత్ 146 పరుగులు చేసి శతకం బాదాడు. ఇటీవలే లీడ్స్ లో జరిగిన తొలి టెస్టులో సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో టీమిండియా జూలై 2 న రెండో టెస్ట్ ఆడుతుంది. ఈ టెస్టులో పంత్ సెంచరీ కొడితే ఇంగ్లాండ్ గడ్డపై వరుసగా మూడు టెస్టుల్లో సెంచరీ చేసిన ఏడో ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటివరకు టెస్టుల్లో ఇంగ్లాండ్ లో బ్రాడ్మన్, వారెన్ బార్డ్స్లీ, ద్రవిడ్, లారా, చార్లెస్ జార్జ్ మెకార్ట్నీ, డారిల్ మిచెల్ మాత్రమే వరుసగా మూడు సెంచరీ బాదారు.
పంత్ సెంచరీ కొడితే రాహుల్ ద్రవిడ్ తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో వరుసగా మూడు సెంచరీలు చేసిన రెండో ప్లేయర్ గా చరిత్ర సృష్టిస్తాడు. 2022లో ద్రవిడ్ ఇంగ్లాండ్ పర్యటనలో నాటింగ్హామ్లో 115, లీడ్స్లో 148, ది ఓవల్లో 217 పరుగులు చేసి వరుసగా మూడు టెస్టుల్లో సెంచరీలు బాదాడు. ఇక ఇంగ్లాండ్ గడ్డపై పంత్ రికార్డ్ అత్యద్భుతంగా ఉంది. ఓవరాల్ గా 10 టెస్టుల్లో 19 ఇన్నింగ్స్లలో 42.52 సగటుతో 808 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 146.