IPL 2025 Final: 18 ఏళ్లకు నెరవేరిన కల: ఐపీఎల్ 2025 విజేత బెంగళూరు.. ఫైనల్లో పంజాబ్‌కు నిరాశ

IPL 2025 Final: 18 ఏళ్లకు నెరవేరిన కల: ఐపీఎల్ 2025 విజేత బెంగళూరు.. ఫైనల్లో పంజాబ్‌కు నిరాశ

ఐపీఎల్ 2025 టైటిల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుచుకుంది. మంగళవారం (జూన్ 3) అహ్మదాబాద్‌ వేదికగా  పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. నరేంద్ర మోడీ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మెగా ఫైనల్లో గెలిచి ఆర్సీబీ తమ ఐపీఎల్ ట్రోఫీ కలను నెరవేర్చుకున్నారు. ఛేజింగ్ లో ఆర్సీబీ బౌలర్లు ఒత్తిడిలో అద్భుతంగా రాణించడంతో ఈ విజయం సాధ్యమైంది.

17 ఏళ్లుగా ఎదురు చూసిన ట్రోఫీ 18వ ప్రయత్నంలో సాధించి తమ కప్ కళను నెరవేర్చుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ 7 వికెట్లకు 184 పరుగులకు పరిమితమైంది.   

191 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ కు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కు 43 పరుగులు జోడించారు. అయితే  ఇన్నింగ్స్ 5 ఓవర్ లో హేజల్ వుడ్ వేసిన షార్ట్ డెలివరీకి పుల్ షాట్ ఆడాలని చూసిన ప్రియాంష్ ఆర్య మిడ్ వికెట్ మీదుగా ఆడి సాల్ట్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తొలి 6 ఓవర్లలో 55 పరుగులు చేసి పంజాబ్ పర్వాలేదనిపించింది. పవర్ ప్లే తర్వాత ప్రభ్ సిమ్రాన్ సింగ్, ఇంగ్లిస్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. రెండో వికెట్ కు 29 పరుగులు జోడించిన తర్వాత సిమ్రాన్ సింగ్ 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. 

ఇన్నింగ్స్ 10 ఓవర్లో షెపర్డ్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. శ్రేయాస్ అయ్యర్ ను ఒక పరుగుకే పెవిలియన్ కు పంపి మ్యాచ్ ఆర్సీబీ వైపుకు లాగాడు. ఇక్కడ నుంచి పంజాబ్ పతనం స్టార్ట్ అయింది. ఏ దశలోనూ  విజయం దిశగా పయనించలేదు. ఒత్తిడిలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. క్రీజ్ లో ఉన్నత సేపు మెరుపులు మెరిపించి జోస్ ఇంగ్లిస్ 13 ఓవర్లో కృనల్ పాండ్య ఔట్ చేయడంతో పంజాబ్ ఒత్తిడిలో పడిపోయింది. ఆడుకుంటాడనుకున్న మార్కస్ స్టోయినిస్, ఓమార్జాయి సింగిల్ డిజిట్ కే పెవిలియన్ కు చేరారు. 

ఓ వైపు శశాంక్ సింగ్ మాత్రం పంజాబ్ జట్టును గెలిపించడానికి తెగ కష్టపడ్డాడు. చివరి వరకు క్రీజ్ లో ఉన్నప్పటికీ అప్పటికే కొట్టాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో విజయానికి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్య, భువనేశ్వర్  కుయిమర్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. హేజల్ వుడ్, షెపర్డ్, యష్ దయాల్ తలో వికెట్ తీసుకున్నారు.        
              
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో ప్రతి ఒక్కరూ కూడా సమిష్టిగా ఆడి జట్టు భారీ స్కోర్ చేయడంలో సహకరించారు. 43 పరుగులు చేసిన కోహ్లీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో కైల్ జెమీసన్, అర్షదీప్ తలో మూడు వికెట్లు పడగొట్టాడు. ఓమార్జాయి, చాహల్, విజయ్ కుమార్ వైశుక్ తలో వికెట్ తీసుకున్నారు.         

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు తొలి ఓవర్ నుంచే ఇన్నింగ్స్ ను దూకుడుగా ఆరంభించింది. అర్షదీప్ వేసిన తొలి ఓవర్ లో 13 పరుగులు రాబట్టింది. అయితే రెండో ఓవర్లోనే ఆర్సీబీకి షాక్ తగిలింది. జెమీసన్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి సాల్ట్ (16)  ఔటయ్యాడు. ఈ దశలో మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ పవర్ ప్లే లో జాగ్రత్తగా ఆడుతూ 55 పరుగులు రాబట్టారు. పవరే ప్లే తర్వాత భారీ షాట్ కు ప్రయత్నించి మయాంక్ (24) చాహల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. 

పటిదార్, కోహ్లీ స్వల్ప భాగస్వామ్యాన్ని నిర్మించి జట్టు స్కోర్ ను కాస్త ముందుకు తీసుకెళ్లారు. పటిదార్ (26) ఉన్నంత సేపు వేగంగా ఆడి  ఔటైనా కోహ్లీ, లివింగ్ స్టోన్ మరో స్వల్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు పటిష్ట స్థితికి చేర్చే ప్రయత్నం చేశారు. అయితే 43 పరుగులు చేసి కోహ్లీ ఔట్ కావడంతో మ్యాచ్ పై పంజాబ్ పట్టు బిగించినట్టు కనిపించింది. ఈ దశలో జితేష్ మెరుపులు మెరిపించాడు. కేవలం 10 బంతుల్లోనే 24 పరుగులు చేసి దూకుడు చూపించాడు. చివర్లో కీలక దశలో వికెట్లు చేజార్చుకున్నప్పటికీ పంజాబ్ ముందు 191 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. చివరి ఓవర్లో అర్షదీప్ మూడు వికెట్లు తీసి బెంగళూరు స్కోర్ 200 పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు.