కోటీ రూపాయలు కాజేసిన దొంగలను గ్రామస్తుల సహయంతో కేవలం 15 నిమిషాల్లోనే నగదుతో సహ పట్టుకున్నారు ఛత్తీస్ గడ్ పోలీసులు. శనివారం ఉదయం రాష్ట్రంలోని బెమెతెరా పీఎస్ పరిధిలో కొందరు దుండగలు SBI( స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) బ్యాంకు కి చెందిన క్యాష్ వ్యాన్ నుంచి పక్కా ప్లాన్ తో రూ. 1.64 కోట్లను దొంగలించారు. నవగర్ ప్రాంతంలో ఏటీఎం లో నగదు జమ చేయడానికి వెళుతన్న వ్యాన్ మార్గ మధ్యంలో పంక్చర్ అయింది. డ్రైవర్ టైరు మారుస్తున్న సమయంలో ఓ కారులో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ముఖాలకి ముసుగులు వేసుకొని వచ్చి వారిని గన్స్ తో బెదిరించి నగదుతో పాటు వాళ్ల తుపాకీలని కూడా ఎత్తుకొని పోయారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న బెమెతెరా పీఎస్ పోలీసులు రాష్ట్ర డీజీపీ సలహాతో రాష్ట్రంలోని ప్రతీ పీఎస్ కు చోరికి కాబడిన వ్యాన్ గురించి, ఆ దొంగల గురించి ఇన్ఫామ్ చేశారు. ఆ రాష్ట్ర పోలీసులకు, జనానికి అనుసంధానంగా ఉన్న ఓ వాట్సాప్ గ్రూప్ (జన్ మిత్ర యోజన) లో ఆ వివరాలను షేర్ చేయడంతో జనాలు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి పోలీసులంతా ఆ వ్యాన్ కోసం గాలించారు.
పోలీసుల చర్యను పసిగట్టున ఆ దొంగలు దిక్కు తోచక బాగూల్ అనే గ్రామంలో ఆగిపోయారు. అప్పటికే ఆ గ్రామంలో కూడా బ్యాంకు నగదు చోరీ కాబడిందనే విషయం తెలియడంతో గ్రామస్తులంతా ఆ కారును ముట్టడించారు. చేసేదేమీ లేక కారు నుంచి దిగి డబ్బుతో సహ పరారయ్యేందుకు యత్నించారు. గ్రామస్తులను బెదిరించడానికి గాలిలో కాల్పులు కూడా జరిపారు. అయినా ఆ ఊరి జనం ధైర్యంతో వారిని ఆపే ప్రయత్నం చేశారు. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు.. నిమిషాల వ్యవధిలోనే స్పాట్ కు చేరుకొని గ్రామస్తుల సహాయంతో ఆ నలుగుర్నీ పట్టుకున్నారు.
గ్రామస్తుల దాడిలో ముగ్గరు గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించామని రాష్ట్ర డీజీపీ చెప్పారు. వారి నుంచి రూ.80 లక్షల సొమ్మును స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన డబ్బును కూడా రికవరీ చేస్తామని అన్నారు. దొంగలు జరిపిన కాల్పుల్లో ఎవరికీ ఏం కాలేదని.. తమకు సహకరించిన గ్రామస్తులను తప్పక సత్కరిస్తామని ఆయన తెలిపారు.