డీలర్ షిప్ కోసం ఆన్​లైన్​లో అప్లై చేస్తే లక్షలు స్వాహా

డీలర్ షిప్ కోసం ఆన్​లైన్​లో అప్లై చేస్తే లక్షలు స్వాహా
  • ఏడాది తర్వాత నిందితుడి అరెస్టు 
  • రూ.3.5 లక్షలు స్వాధీనం

ములుగు, వెలుగు: కంపెనీ డీలర్​షిప్​కోసం ఆన్​లైన్​లో అప్లై చేసుకోగా రూ.8.9 లక్షలు స్వాహా చేసిన వ్యక్తిని ఏడాది తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. ములుగు ఏఎస్పీ పోతరాజు సాయిచైతన్య తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన కొండ వెంకటరాజు ప్రైవేట్​ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఏడాది క్రితం కరోనా టైంలో ఇంటివద్దనే ఉన్నాడు. ఆ సమయంలో ఆన్​లైన్​లో జియో మార్ట్​ డీలర్​షిప్​ కోసం అప్లై చేసుకున్నాడు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా సబ్మిట్​చేశాడు. డీలర్​షిప్​ఇచ్చేందుకు కంపెనీకి డిపాజిట్​చేయాలని చెప్పగా ఆన్​లైన్​ ద్వారా రూ.8.9 లక్షలు కంపెనీ పేరిట ఉన్న అకౌంట్​కు ట్రాన్స్​ఫర్​చేశాడు. డబ్బులు వేసిన తర్వాత కంపెనీ పేరిట ఉన్న ఫోన్​స్విచ్​ఆఫ్ అయ్యింది. కంపెనీకి ఫోన్​చేసినా ఎలాంటి రెస్పాన్స్​ లేకపోవడంతో ములుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడాది కాలంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. డీలర్​షిప్​కావాలంటూ ఆన్​లైన్​లో అప్లై చేసి నిందితుడికి ఎర వేశారు. ఫోన్​నంబర్​ఆధారంగా నిందితుడు కర్నాటక రాష్ట్రం కొడుగు జిల్లా కుశాల్​నగర్​మండలం చౌటెల్లి గ్రామానికి చెందిన కేవీ. మహేంద్రగా గుర్తించారు. కర్నాటక వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రూ.3.5 లక్షలు రికవరీ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.