
ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదు మ్యాచ్ల సిరీస్ను సచిన్ టెండూల్కర్–జేమ్స్ అండర్సన్ పేరు మీద నిర్వహించడం ఖారారైంది. పటౌడీ ట్రోఫీకి గుడ్ బై చెప్పాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు భావించింది. దీంతో జూన్ 14న జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ సందర్భంగా పటౌడీ ట్రోఫీని టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా అధికారికంగా పేరు మార్చే కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే అహ్మదాబాద్లో జరిగిన విషాద విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు నివాళిగా దానిని వాయిదా వేశారు. ఈ సిరీస్ పేరును అధికారికంగా మార్చడానికి బీసీసీఐ, ఈసీబీ ఇప్పుడు కొత్త తేదీ కోసం చూస్తున్నాయి.
2025-27 టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ను ఇరు జట్లు మరో ఐదు రోజుల్లో ప్రారంభించబోతున్నాయి. ఈ సమయంలో పటౌడీ ట్రోఫీ పేరు మార్చవద్దని భారత క్రికెట్ దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ భావిస్తున్నాడట. ఈ మేరకు సచిన్ బీసీసీఐ, ఈసీబీతో మాట్లాడి రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. పటౌడీ వారసత్వం కొనసాగాలని వారి కుటుంబానికి మధురమైన జ్ఞాపకాలను అందించాలని సచిన్ ఇరు దేశాల బోర్డులతో మాట్లాడినట్టు క్రిక్ బజ్ కన్ఫర్మ్ చేసింది. దీంతో ఇప్పుడే ఇరు జట్ల బోర్డులు కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆసక్తికరంగా మారింది.
గతంలో ఇఫ్తికార్ అలీఖాన్ పటౌడీ, అతని కుమారుడు మన్సూర్ అలీఖాన్ పటౌడీ పేర్ల మీద ‘పటౌడీ ట్రోఫీ’ కోసం యూకేలో ఇంగ్లండ్, ఇండియా మధ్య టెస్ట్ మ్యాచ్లు నిర్వహించారు. కానీ ఈ ట్రోఫీని విరమించుకుంటున్నట్లు ఈసీబీ మార్చిలో పటౌడీ ఫ్యామిలీకి లేఖ రాసింది. దీనిపై ఎలాంటి స్పందన వచ్చిందో తెలియరాలేదు. ఆల్టైమ్ గ్రేట్స్లో ఒకరైన సచిన్ 15921 రన్స్తో టాప్లో ఉండగా, అండర్సన్ 704 వికెట్లు సాధించాడు. ఈ ఇద్దరికి గుర్తింపుగా ఈ ట్రోఫీకి పేరుపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఇంగ్లండ్ గడ్డపై భారత్–ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ద్వైపాక్షిక టెస్టు సిరీస్ను 2007 నుంచి మన్సూర్ అలీఖాన్ (ఎంఏకే) పటౌడీ ట్రోఫీ పేరిట నిర్వహించడం జరుగుతోంది. ఇంగ్లండ్-భారత్ మధ్య టెస్టు మ్యాచ్ జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని 2007లో ఈ ట్రోఫీని ఆరంభించారు. ఎంఏకే పటౌడీ 1961 నుంచి 1975 మధ్యకాలంలో భారత జట్టు తరఫున 46 టెస్టులు ఆడారు. 34.91 సగటుతో 2793 పరుగులు చేశాడు. వీటిలో ఆరు సెంచరీలు.. 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతను ఆడిన 46 టెస్టుల్లో 40 టెస్ట్లు ఇండియా కెప్టెన్ గా చేసాడు. 1967లో న్యూజిలాండ్పై భారతదేశం తొలి విదేశీ టెస్ట్ విజయాన్ని సాధించింది. పటౌడీ మొత్తం 310 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు.
ఈ ట్రోఫీ 2007లో ప్రారంభమైంది. భారత్ తొలి ప్రయత్నంలోనే రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో ఈ ట్రోఫీ అందుకుంది. ఆ తర్వాత వరుసగా ఇంగ్లాండ్ మూడు సార్లు ఈ ట్రోఫీ గెలిచింది. 2011, 2014, 2018లలో ఇంగ్లాండ్ పటౌడీ సిరీస్ ను కైవసం చేసుకుంది. తర్వాత 2022లో డ్రా అయినప్పటికీ ఇంగ్లాండ్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. ‘పటౌడీ ట్రోఫీ’కి వీడ్కోలు పలుకుతున్నామనే విషయాన్ని పటౌడీ కుటుంబసభ్యులకు ఇప్పటికే ఈసీబీ సమాచారం ఇచ్చిందని తెలిసింది.