IND vs ENG 2025: ఐపీఎల్ నుంచి బయటకు రాలేదా.. నిర్లక్ష్యపు షాట్‌తో డకౌటైన సాయి సుదర్శన్

IND vs ENG 2025: ఐపీఎల్ నుంచి బయటకు రాలేదా.. నిర్లక్ష్యపు షాట్‌తో డకౌటైన సాయి సుదర్శన్

ఐపీఎల్ లో అద్భుతమైన ఫామ్ కారణంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో సాయి సుదర్శన్ చోటు దక్కించుకున్నాడు. లీడ్స్ వేదికగా శుక్రవారం (జూన్ 20) ప్రారంభమైన తొలి టెస్ట్ లో అభిమన్యు ఈశ్వరన్ ను కాదని ఈ తమిళనాడు కుర్రాడిని జట్టులోకి తీసుకోవడం కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఫామ్ లో ఉన్న కారణంగా సాయి సుదర్శన్ పై అందరికీ ఆడతాడనే నమ్మకాలున్నాయి. కానీ సుదర్శన్ మాత్రం తన అరంగేట్ర మ్యాచ్ లో పరుగుల ఖాతా తెరవకుండానే డకౌటయ్యాడు. 

సుదర్శన్ నిర్లక్ష్యపు షాట్ తో ఔట్ కావడం విమర్శలకు గురి చేస్తోంది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ లెగ్ సైడ్ వేసిన బంతిని సాయి సుదర్శన్ ఫ్లిక్ షాట్ ఆడబోయాడు. టైమింగ్ సరిగా కుదరక షాట్ మిస్ అవ్వడంతో బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ చేతుల్లో పడింది. దూరంగా వెళ్తున్న బంతిని జెమీ స్మిత్ అద్భుతంగా డైవ్ చేసి పట్టుకున్నాడు. ఐపీఎల్ లో ఇలాంటి ఫ్లిక్ షాట్స్ ఆడి పరుగులు రాబట్టిన సుదర్శన్ కు టెస్టుల్లో వర్కౌట్ కాలేదు. రిస్కీ కావడంతో సాధారణంగా టెస్టుల్లో ఫ్లిక్ షాట్స్ ఆడడానికి బ్యాటర్లు సాహసం చేయరు. కానీ సుదర్శన్ షాట్ సెలక్షన్ విమర్శలు తీసుకొని వస్తుంది. రెండో ఇన్నింగ్స్ లో ఆడకపోతే సుదర్శన్ రెండో టెస్టుకు చోటు కోల్పోయే ప్రమాదం ఉంది. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే లంచ్ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజ్ లో ఓపెనర్ జైశ్వాల్ (42), కెప్టెన్ శుభమాన్ గిల్ (0) ఉన్నారు. రాహుల్ 42 పరుగులు చేసి రాణించగా.. అరంగేట్ర టెస్టులో సాయి సుదర్శన్ డకౌటయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టోక్స్, కార్స్ తలో వికెట్ తీసుకున్నారు.