- జూన్ 2న ఆదిలాబాద్లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం
- పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా క్యూర్ పరిధిలో 5 నుంచి 8 కి.మీ. పరిధి లోనే ఇందిరమ్మ ఇండ్లు
- నియోజక వర్గం యూనిట్ గా స్థలాల గుర్తింపు
- డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపుపై స్పెషల్ డ్రైవ్
- ఈనెల చివరిలోగా హైదరాబాద్ లో ఇండ్ల స్ధలాలు కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు
- అంగుళం ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనా సహించేది లేదు
- ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల సమీక్షలో మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ సూచన మేరకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడతను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై ఈ నెల 21 వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా మంగళవారం (మే 12) నాడు హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఇన్ ఛార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల కమీషనర్లు, హౌసింగ్, రెవెన్యూ, ఫారెస్టు అధికారులతో మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాల్లో శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, రంగారెడ్డి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి మహ్మద్ అజారుద్దీన్, శాసన మండలిలో చీఫ్ విప్ మహేందర్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం దూరదృష్టి లేకుండా హైదరాబాద్ నగరానికి దూరంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించడం వల్ల జరిగిన నష్టం కళ్లముందే కనిపిస్తున్నదన్నారు. అటువంటి తప్పు పునరావృత్తం కాకుండా పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిథిలోనే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించే విధంగా నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని స్థలాలను గుర్తించి తగిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆనాటి ప్రభుత్వం నగరానికి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో 2 బిహెచ్ కె ఇండ్లను నిర్మించి హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న వారికి కేటాయించడం వల్ల తమ జీవనోపాథికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశ్యంతో ఇండ్లు తీసుకున్న లబ్ధిదారులు అక్కడ నివసించడానికి సంసిద్ధతం వ్యక్తం చేయడం లేదని క్షేత్ర స్థాయి పరిశీలనల్లో స్పష్టమైందన్నారు. ఈ అంశాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలోనే ప్రభుత్వ స్థలాలు, మురికివాడలు, భూదాన్, గతంలో వివిధ పథకాల కింద నిర్మించిన ఇళ్లు శిధిలావస్థలో ఉన్న ప్రాంతాలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈ విషయంలో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యులను చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆ ఇండ్లపై స్పెషల్ డ్రైవ్
2 బిహెచ్ కె ఇండ్లకు లబ్ధిదారులను కేటాయించడానికి యుద్ధప్రాతిపదికన స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పూర్తి అయిన వాటికి, వివిధ నిర్మాణ దశల్లో ఉన్న వాటికి ఈ నెలాఖరు కల్లా లబ్ధిదారులను గుర్తించాలని, అది కూడా ఆ కాలనీలకు అయిదు నుంచి ఎనిమిది కిలోమీటర్ల లోపు ఉన్న వారినే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మాణాలన్నీ పూర్తైన ఇండ్లలో లబ్ధిదారులు ఉండేలా చూసేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ కాలనీల్లో మంచినీరు, డ్రైనేజి, విద్యుత్ వంటి కనీస సౌకర్యాల కల్పనకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు.
హైదరాబాద్ పరిధిలో ఇండ్ల స్ధలాలు ఉండి అర్హులైన లబ్దిదారులకు ఈనెల చివరిలోగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరక్టర్లు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని, పనితీరు మెరుగుపడాలని అన్నారు. పిడిలు తమ పరిధిలో గతంలో నిర్మించిన జెన్ఎన్ యుఆర్ఎం, రాజీవ్ గృహకల్ప, వాంబే హౌసింగ్ కాలనీలన్నిటిని సందర్శించాలని స్పష్టంగా నిర్దేశించారు.
అంగుళం అన్యాక్రాంతమైనా సహించేది లేదు
అంగుళం ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనా కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి పొంగులేటి గారు హెచ్చరించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో యుఎల్ సి భూములు కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, నిబంనలకు విరుద్దంగా కొంత భాగాన్ని రిజిస్ట్రేషన్ చేశారని , స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి సమావేశంలో మంత్రి దృష్టికి తీసుకుని రాగా వెంటనే సంబంధిత సబ్ రిజిస్ట్రార్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
శాశ్వత భవనాలు లేని ఆర్డీవో, తహశీల్దార్, సబ్ రిజస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. రెవెన్యూ, ఫారెస్టు సరిహద్దు వివాదాలకు ముగింపు పలికేలా రెండు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
