- ఛత్తీస్ గఢ్ లో ఘాతుకం
- బస్సు డ్రైవర్ సహా ముగ్గురు జవాన్ల మృతి..మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
- బస్సులో 40 మంది జవాన్లు ఉండగా పేలిన మందుపాతర
మావోయిస్టులు మరోసారి తెగబడ్డారు. ఛత్తీస్ గఢ్ లో జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును టార్గెట్ చేసి మందుపాతర పేల్చారు. దీంతో బస్సు ఒక్కసారిగా ఎగిరిపడింది. డ్రైవర్ తోపాటు ముగ్గురు జవాన్లు స్పాట్ లో చనిపోయారు. బస్సులో ఉన్న వారంతా గాయపడగా.. 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని నారాయణ్పూ ర్జిల్లా ఘనా జంగల్లో ఘటన జరిగింది. మందుపాతర పేల్చిన సమయంలో బస్సులో 40 మంది జవాన్లు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజులుగా రెక్కీ నిర్వహిస్తున్న మావోలు.. మంగళవారం నాడు అదను చూసి మందుపాతర పేల్చినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కోసం ఒక వైపు కూంబింగ్ జరుగుతున్న నేపధ్యంలో మావోయిస్టులు పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించి ఎదురుదాడికి దిగడం కలకలం రేపుతోంది. నారాయణ్ పూర్ జిల్లాలోని కడేనార్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించిన జవాన్లు కన్హార్ ప్రాంతానికి తిరిగి వస్తుండగా మావోలు మందుపాతర పేల్చారు. కడేనార్–మందోడా గ్రామాల మధ్య ఘనా అడవుల్లో కాపుకాసిన మావోయిస్టులు మందుపాతరతో బస్సును పేల్చివేశారు. ఒకవైపు శాంతి చర్చలు అంటూనే మావోయిస్టులు దాడులకు దిగుతున్నారని నక్సల్స్ ఆపరేషన్స్ డీజీ అశోక్జునేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయపడిన జవాన్లను అంబులెన్స్ ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలిపారు. డ్రైవర్సహా ముగ్గురు జవాన్లు చనిపోయినట్లుగా ఆయన ధృవీకరించారు.