
ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య శుక్రవారం (జూన్ 20) లీడ్స్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. భారత జట్టు ప్లేయింగ్ 11 పై ఉత్కంఠ వీడింది. గిల్ సేన ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు.. ఇద్దరు ఆల్ రౌండర్లు.. ఆరుగురు బ్యాటర్లతో బరిలోకి దిగుతుంది. ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కకపోవడం విచారకరం. ఈ హైదరాబాదీ కుర్రాడి స్థానంలో బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ కు స్థానం దక్కింది.
2024-25 ఆస్ట్రేలియా పర్యటనలో నితీష్ కుమార్ రెడ్డి తొలిసారి భారత టెస్ట్ జట్టులో స్థానం సంపాదించాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఒక సెంచరీతో సహా ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ 288 పరుగులు చేసి దుమ్ము లేపాడు. వీటిలో మెల్ బోర్న్ లో చేసిన సెంచరీ కూడా ఉంది. అయితే బౌలింగ్ లో నితీష్ అంతగా ప్రభావం చూపలేకపోయాడు. ఇంగ్లాండ్ గడ్డపై నాలుగో సీమర్ చాలా ముఖ్యం. నితీష్ బౌలింగ్ ఇంగ్లీష్ గడ్డపై సరిపోదు. ఐపీఎల్ లో విఫలమవడం కూడా నితీష్ కు మైనస్ గా మారింది. దీంతో నితీష్ బదులు బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ కు తొలి టెస్టులో ఛాన్స్ దక్కింది.
శార్దూల్ ఠాకూర్ కు తొలి టెస్టులో ఆడడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. గతంలో ఇంగ్లాండ్ పర్యటనలో ఈ బౌలింగ్ ఆల్ రౌండర్ కు అద్భుతమైన రికార్డ్ ఉంది. బ్యాటింగ్ లో హాఫ్ సెంచరీలు చేయడంతో పాటు బౌలింగ్ లో మెరుగ్గా రాణించాడు. ఇటీవలే దేశవాళీ క్రికెట్ లో శార్దూల్ టాప్ ఫామ్ లో ఉన్నాడు. పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడంతో పాటు లోయర్ ఆర్డర్ లో కీలక పరుగులు సాధించగలడు. వీటితో పాటు టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియా-ఎ జట్ల మధ్య జరిగిన ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్లో కూడా శార్దూల్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ టెస్ట్ లో సాయి సుదర్శన్ టీమిండియా తరపున టెస్ట్ అరంగేట్రం చేశాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇండియా 11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 32 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (8), యశస్వి జైశ్వాల్ (23) క్రీజ్ లో ఉన్నారు.