స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగాఎన్నిక నిర్వహించాలి

స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగాఎన్నిక నిర్వహించాలి

కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది.  మలయాళ దినపత్రిక 'మాతృభూమి'కి ఆయన ఓ వ్యాసం రాశారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక గురించి ప్రస్తావించిన థరూర్.. ‘స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా’ ఎన్నిక నిర్వహించాలని, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ స్థానాలకు సైతం పార్టీ పోలింగ్ నిర్వహించాలన్నారు. పార్టీలో సంస్థాగత సంస్కరణలను డిమాండ్ చేస్తూ 2020లో సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతలలో  శశి థరూర్  ఒకరు.  

‘కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం కాంగ్రెస్ పునరుజ్జీవనానికి ఒక ప్రారంభం మాత్రమే, ఇది కాంగ్రెస్‌కు చాలా అవసరం. ఎన్నికల కోసం చాలా మంది అభ్యర్థులు ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను. పార్టీ, దేశం కోసం మీ అభిప్రాయాలను తెలియజేయడం ఖచ్చితంగా ప్రజల ఆసక్తిని రేకెత్తిస్తుంది’ అని థరూర్‌ పేర్కొన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండో ఓటమిని చవిచూడడంతో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో పార్టీ కొత్త అధ్యక్షుడి పై ఉత్కంఠ నెలకొంది 

ఇప్పటికి రెండుసార్లు

కాంగ్రెస్‌లో ఇప్పటి వరకు అధ్యక్ష పదవికి రెండు సార్లు ఎన్నికలు జరిగాయి.  ముందుగా 1997లో శరద్ పవార్, రాజేశ్‌ పైలట్, సీతారాం కేసరి పోటీ పడ్డారు. ఇందులో సీతారాం కేసరి విజయం సాధించారు.  ఆయనకు 6,624 ఓట్లు రాగా, పవార్‌కు 882, పైలట్‌కు 354 ఓట్లు వచ్చాయి. ఇక 2000లో జరిగిన ఎన్నికల్లో సోనియా గాంధీ,  జితేంద్ర ప్రసాద్‌ పోటీ పడగా, సోనియాకు 7,448 ఓట్లు రాగా.. జితేంద్ర ప్రసాద్‌కు 94 వచ్చాయి.  ప్రజాస్వామ్య స్ఫూర్తి కోసమే పోటీ చేసినట్లుగా అప్పుడు జితేంద్ర ప్రసాద్‌ తెలిపారు.