నా అదృష్టంన్యూఢిల్లీ: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ అంటేనే ఉల్లాసం, ఉత్సాహానికి మారుపేరు. వేర్వేరు ప్రదేశాల నుంచి వచ్చినా.. ప్రతి ఒక్కరూ చాలా కలివిడిగా ఉంటారు. అందుకే ఇండియా టీమ్లో ప్రతి వ్యక్తి చాలా భిన్నంగా ఉంటారని ఓపెనర్ శిఖర్ ధవన్ అన్నాడు. ప్రతి ఒక్కరు టీమ్ కోసం చాలా కష్టపడతారని, వారిలో ఉండే ఎనర్జీనే అత్యుత్తమ కాంబినేషన్స్కు కారణమని చెప్పాడు. అందుకే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలాంటి కరెంట్ జనరేషన్ ప్లేయర్లతో కలిసి ఆడటం తన అదృష్టమని చెప్పాడు. ‘టీమ్లో ప్రతి ఒక్కరు ఓ స్పెషల్. వీళ్లంతా కలిసి టీమ్గా రూపొందడం మరో అద్భుతం. ప్రతి ప్లేయర్ చాలా డిఫరెంట్గా ఉంటాడు. ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది టీమ్కు చాలా ఉపయోగపడుతున్నది. ప్రతి ఒక్కరు తమ స్పిరిట్ను చూపెడుతున్నారు’ అని ధవన్ పేర్కొన్నాడు.
విరాట్, రోహిత్ అమేజింగ్..
తన సహచరులు విరాట్, రోహిత్లను గబ్బర్ ఆకాశానికెత్తేశాడు. ఆరంభంలో కుదురుకోవడానికి రోహిత్ కాస్త టైమ్ తీసుకున్నా.. ఆ తర్వాత అతన్ని ఆపడం ఎవరి తరం కాదన్నాడు. ‘ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకుంటే రోహిత్ విధ్వంసం సృష్టిస్తాడు. ఏ బౌలర్, ఏ ఫీల్డర్, ఏ కెప్టెన్ కూడా అతన్ని ఆపలేరు. తనంతట తానుగా అతను ఔట్ కావాలి. లేదంటే ఆరంభంలోనే వికెట్ తీయాలి. ఈ రెండు జరగలేదంటే ఆ రోజు బౌలర్లకు చుక్కలే. ఇక విరాట్ ఆట అద్భుతం. పరిస్థితులు ఎలా ఉన్నా.. నిలకడగా రన్స్ సాధిస్తాడు. అమేజింగ్ ఫుట్వర్క్, క్లాసిక్ ఆటతీరుతో బౌలర్లకు సింహ స్వప్నంగా నిలుస్తాడు. అందుకే ఈ ఎరాలో వీళ్లతో కలిసి ఆడుతున్నందుకు నా అంతఅదృష్టవంతుడు మరొకరు ఉండరు. బయట పరిస్థితులు ఎలా ఉన్నా నాలో ఉన్న అంతర్గత మనశ్శాంతిని మాత్రం ఏమీ చేయలేవు’ అని ఈ ఢిల్లీ బ్యాట్స్మన్ వ్యాఖ్యానించాడు.
ఒకరితో పోల్చుకోను..
తోటి క్రికెటర్లతో పోల్చుకుంటే నెగెటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తాయని ధవన్ వెల్లడించాడు. ‘ఇతర ఓపెనర్లు, టీమ్మేట్స్తో పోటీపడటానికి ఇష్టపడతాను. కానీ వాళ్లతో పోల్చుకోవడం నాకు ఇష్టం ఉండదు. వాళ్లతో కంపేర్ చేసుకోవడం వల్ల జెలసీ వస్తుంది. నేను బాగా ఆడినా.. వాళ్లకంటే బాగా ఆడలేదనే నెగెటివ్ ఫీలింగ్లో ఉండిపోతా. అల్టిమేట్గా నా ఆట దెబ్బతింటుంది. కాబట్టి ఈ విషయంలో నేనే ఓ అడుగు వెనక్కి వేసి నా కలలను నెరవేర్చుకున్నా కదా ఇంకెందుకు ఇబ్బంది అని సర్ది చెప్పుకుంటా. లేదంటే లైఫ్లో రియల్ హ్యాపీనెస్ను కోల్పోతా. దీనివల్ల ఇంకేదో సాధించాలన్న కసి పెరుగుతుంది. అందుకే నేనెవరితోనూ పోల్చుకోను. రెండు రోజులు ఆడినా.. రెండేళ్లు ఆడినా నా దృక్పధం ఇదే’ అని శిఖర్ చెప్పాడు. స్కిల్స్కు ఎలాగైతే మెరుగులు దిద్దుకుంటామో.. మైండ్సెట్ను కూడా అలాగే కాపాడుకోవాలన్నాడు. ‘నాలో ఈ ఎనర్జీ ఉంది కాబట్టే నేనింకా క్రికెట్ ఆడుతున్నా. ఒకవేళ నేను జీరోకే ఔటైనా పాజిటివ్గానే తీసుకుంటా. అంటే అలా ఎందుకు ఔటయ్యానని విశ్లేషణ చేసుకోలేనని కాదు. నేను చేసిన తప్పును అర్థం చేసుకుంటా. దాన్ని అధిగమించేందుకు కృషి చేస్తా. ఈ ఎనర్జీ అంతా నాకు యోగా నుంచి వచ్చింది. ఫిజికల్గా, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండేందుకు ఇది ఉపయోగపడుతున్నది’ అని ధవన్ చెప్పుకొచ్చాడు.