Shoaib Malik: పెళ్ళైన మరుసటి రోజే మెరిసిన షోయ‌బ్.. తొలి ఆసియన్ క్రికెట‌ర్‌గా రికార్డు

Shoaib Malik: పెళ్ళైన మరుసటి రోజే మెరిసిన షోయ‌బ్.. తొలి ఆసియన్ క్రికెట‌ర్‌గా రికార్డు

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్(Shoaib Malik) పెళ్ళైన మరుసటి రోజే అరుదైన రికార్డు సాధించాడు. జనవరి 19న పాకిస్తానీ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్న ఈ క్రికెటర్.. జనవరి 20న ఓ మైలురాయిని అధిగమించి తొలి ఆసియా క్రికెట‌ర్‌గా చరిత్ర సృష్టించాడు.

బంగ్లాదేశ్ ప్రీమియ‌ర్ లీగ్‌(బీబీఎల్)లో ఫార్చ్యూన్ బరిష‌ల్ జ‌ట్టుకు ఆడ‌తున్న మాలిక్.. శనివారం రంగాపూర్ రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 17 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో టీ20 పార్మాట్‌లో 13 వేల ప‌రుగుల మైలురాయిని దాటాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆసియన్ క్రికెట‌ర్‌ ఇతడే. ఓవరాల్‌గా ఈ మైలురాయిని చేరుకున్న రెండో ఆటగాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ విధ్వంస‌క ఓపెన‌ర్ క్రిస్ గేల్(14562) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటికే టెస్టులు, వ‌న్డేల‌కు రిటైర్మెంట్ ప్రక‌టించిన ఈ ఆల్‌రౌండ‌ర్.. కేవలం టీ20ల్లో మాత్రమే కొన‌సాగుతున్నాడు.

ముచ్చ‌ట‌గా మూడో పెళ్లి

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా(37)తో తన బంధాన్ని తెంచుకున్న ఈ క్రికెటర్.. పాకిస్తానీ నటి సనా జావేద్‌ను మనువాడాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. త‌మ పెండ్లి ఫొటోల‌కు 'అహ్మదుల్లా.. మేము ఒక్కట‌య్యాం..' అని క్యాప్షన్‌ జోడిస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అంతకంటే ముందు అతనికి 2002లో అయేషా సిద్దిఖీతో వివాహమైంది. 2010లో ఆమెకు విడాకులిచ్చిన షోయబ్.. అదే ఏడాది సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు.