- గ్రేటర్లో కస్టమర్లను దోచుకుంటున్న షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు
- ఏప్రిల్ 18న ఫోరంను ఆశ్రయించిన ఉప్పల్ వాసి
- బేగంపేటలోని షాపర్స్ స్టాప్ కు రూ.7వేలు ఫైన్ విధించిన సివిల్ సప్లయ్ అధికారులు
రమేష్ ప్రైవేట్ ఎంప్లాయ్. భార్య సువర్ణతో కలిసి సిటీలో పేరున్న ఓ షాపింగ్ మాల్కు వెళ్లాడు. మాల్ ఎంట్రన్స్లోనే వారి దగ్గర ఉన్న క్యారీ బ్యాగులను తీసేసుకొని టొకెన్ ఇచ్చారు. మాల్లో షాపింగ్ చేశాక.. బిల్లింగ్ దగ్గరకు వచ్చాక సార్ క్యారీ బ్యాగు కావాలా? మీ దగ్గర ఏమైనా ఉందా? అన్ని బాయ్ ప్రశ్నించాడు. దీనికి రమేష్ వెంట తెచ్చుకున్న క్యారీ బ్యాగులను బయటే తీసేసుకున్నారు కదా.. అని సమాధానం ఇచ్చాడు. రూల్స్ అంతేనంటూ బాయ్ అనడంతో రమేష్ మేనేజర్ను పిలవండి.. ఇదేం దోపిడీ అంటూ ప్రశ్నించాడు. అదనంగా క్యారీ బ్యాగుల పేరిట వసూలు ఎందుకుని వాదించాడు. అయినా ఫలితం లేకపోవడంతో కవర్ కొనుక్కొని వెళ్ళిపోయారు.
హైదరాబాద్, వెలుగు:
సురేష్, రమేష్లాంటి వాళ్లు ఎందరో భారీ షాపింగ్ మాల్స్, సూపర్మార్కెట్లలో ఇతరత్రా వాటిలో క్యారీ బ్యాగుల పేరిట డబ్బుల దోపిడీకి గురువుతున్నారు. అక్కడక్కడా దీనిపై కొందరు ప్రశ్నిస్తున్నప్పటికీ.. వాగ్వాదం జరుగుతున్నప్పటికీ షాపింగ్ కు వచ్చిన తోటి కస్టమర్లే కవర్ కోసం ఈ గొడవ ఏంటనీ చూస్తుంటారు. కానీ.. కవర్ కేవలం 5 రూపాయలే కదా..ఈ చిల్లర కోసం గొడవెందుకని వదిలిస్తే ఆ చిల్లర డబ్బులతో సిటీలోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, మార్కెట్లు రూ. కోట్లు గడిస్తున్నారని వినియోగదారుల ఫోరం సభ్యులు పేర్కొంటున్నారు.
సివిల్ సప్లయ్ అధికారుల్లో కదలిక..
సిటీలోని ఈ క్యారీ బ్యాగుల దోపిడీపై సివిల్ సప్లయ్ శాఖ నజర్ పెట్టింది. ఇటీవల చత్తీస్గడ్లో దినేశ్ అనే వ్యక్తి నుంచి బాటా షాపు వారు క్యారీ బ్యాగు కోసం రూ.3 వసూలు చేశారు. దీంతో అతను వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన ఫోరం అధికారులు రూ.9 వేలు నష్టపరిహారంగా ఇవ్వాలని సదరు సంస్థను ఆదేశించారు. ఈ అంశం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. తాజాగా..గ్రేటర్ హైదరాబాద్లో ఉప్పల్ కి చెందిన శ్రీకాంత్ ఉదంతంతో సివిల్ సఫ్లయ్ అధికారుల్లో కదలిక మొదలైంది. ముఖ్యంగా సిటీలోని షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, ఇతర దుకాణాలలో ఆయా యాజమానులు క్యారీ బ్యాగులు అందజేస్తున్న విధానంపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సివిల్ సప్లయ్ శాఖాధికారి ఒకరు తెలిపారు. గ్రేటర్లోని 12 సర్కిళ్ల పరిధిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. ఇదివరకే ఈ క్యారీ బ్యాగుల విషయంలో చాలా కంప్లయింట్ లు అందాయని..వాటిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కొన్నింటికి నోటీసులు కూడా ఇచ్చిన మార్పులేదని, ప్రస్తుతానికి క్యారీ బ్యాగుల దోపిడీపై స్పెషల్ డ్రెవ్ చేపట్టే ఆలోచన చేస్తున్నామన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటుపడుతుంటే.. ఇష్టారాజ్యంగా క్యారీ బ్యాగులను ముద్రించుకోని షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేయడంపై కఠిన చర్యలకు సిద్ధమైందనట్లు ఆ అధికారి పేర్కొన్నారు. కస్టమర్లు కూడా కంప్లయింట్ చేసేందుకు ధైర్యంగా ముందుకు రావాలన్నారు. క్యారీ బ్యాగుల కోసం కంప్లయింట్ చేయడమెందుకని అనుకోకుండా కస్టమర్లు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించవచ్చన్నారు. పౌరులకు అన్నీ విధాల హక్కులు ఉన్నాయని, ఫోరం హక్కుల పరిరక్షణకు కృషి చేస్తుందని సదరు అధికారి తెలిపారు.
ఫోరంను ఇలా ఆశ్రయించాలి
వినియోగదారుల చట్టం కింద నష్టపరిహారం పొందేందుకు జిల్లా స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు మూడంచెల ఫోరం ఉంటుంది. జిల్లాకు రిటైర్డ్జడ్జి అధ్యక్షుడిగా స్పెషల్ కోర్టు ఉంటుంది. ఈ ఫోరంలో ఇద్దరు సభ్యులు ఉంటారు. అక్కడ న్యాయం దొరక్కపోతే హైకోర్టు, సుప్రీం కోర్టులో ఉండే వినియోగదారుల ఫోరంను కూడా ఆశ్రయించవచ్చు. జిల్లా ఫోరంలో రూ.20 లక్షలలోపు, ఆపై నుంచి రూ. కోటి వరకు హైకోర్టులో, అంతకు మించి నష్టపరిహారం కోరితే సుప్రీంకోర్టు వినియోగదారుల ఫోరంలో కేసు వేసుకోవచ్చు. ఒకవేళ జిల్లా ఫోరంలో ఇచ్చిన తీర్పు సంతృప్తికంగా లేకపోతే 30 రోజుల్లోగా పై కోర్టుల్లో అప్పీలు చేసుకోవచ్చు. ఫోరంలో కేసు వేయడానికి లాయర్ అవసరం లేదు. మీరే వాదించుకోవచ్చు.
తక్కువ ఫీజు
ఫోరంలో దరఖాస్తు చేసుకునేందుకు నామమాత్రపు ఫీజు ఉంటుంది. మనం కోరే నష్ట పరిహారం.. కోర్టును బట్టి ఫీజులు ఉంటాయి. ముందుగా ఏ కంపెనీ, ఎలాంటి సేవలపై ఫిర్యాదు చేస్తున్నాం, ఎలాంటి ఇబ్బందులు పడ్డాం. ఏం పరిహారం కావాలనుకుంటున్నాం వంటి వివరాలు తెల్లకాగితంపై రాసి, దానికి అఫిడవిట్ జతచేసి దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సంబంధిత ధ్రువపత్రాలను జతచేయాలి. అంటే బిల్లులు, ఒప్పంద పత్రాలు వంటివి ఇవ్వాలి. ఆపై నిర్ణీత ఫీజు చెల్లించి కేసు దాఖలు చేయాల్సి ఉంటుంది. వినియోగదారుడు ఫోరంను ఆశ్రయించిన తర్వాత 90 రోజుల్లోపు కేసును పూర్తిచేయాలన్న నిబంధన ఉంది. సమస్య ఏర్పడిన రెండేళ్లలోగా వినియోగదారుడు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. లాయర్ ద్వారా లేదా మీరే సొంతంగా కేసును వాదించుకోవచ్చు.