
లీడ్స్ టెస్టులో టీమిండియాకు వర్షం అదృష్టం రూపంలో వచ్చినట్టు కనిపిస్తుంది. ఇంగ్లాండ్ పై ఒక దశలో పరాజయం ఖాయమనుకుంటే అనూహ్యంగా మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడ్డాడు. వికెట్ నష్టపోకుండా 181 పరుగులతో విజయం దిశగా దూసుకెళ్తున్న సమయంలో చినుకులు పడ్డాయి. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ప్రస్తుతం చిరు జల్లులు కురుస్తున్నాయి. మ్యాచ్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి. దీంతో ఇంగ్లాండ్ గెలవాల్సిన ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డకెట్ (105) సెంచరీ చేసుకోగా.. మరో ఓపెనర్ క్రాలీ (59) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆట చివరి రోజు చివరి రెండు సెషన్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంగ్లాండ్ విజయానికి 55 ఓవర్లలో 190 పరుగులు కావాలి. మరోవైపు టీమిండియాకు 10 వికెట్లు తీస్తేనే విజయం సాధిస్తుంది. వికెట్ నష్టపోకుండా 117 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన ఇంగ్లాండ్ వేగంగా ఆడింది. ఓపెనర్లిద్దరూ బ్యాట్ ఝుళిపించడంతో స్కోర్ బోర్డు శరవేగంగా ముందుకు కదిలింది. ఈ క్రమంలో డకెట్ సెంచరీ పూర్తి చేసుకోగా.. క్రాలీ (59) హాఫ్ సెంచరీతో అతనికి చక్కని సహకారం అందిస్తున్నాడు.
డకెట్, క్రాలీ అలవోకగా పరుగులు రాబట్టారు. దూకుడుగా ఆడుతూ భారత బౌలర్లపై ఆధిపత్యం చూపించారు. సిరాజ్ బౌలింగ్ లో జైశ్వాల్ క్యాచ్ జారవిడవడం కూడా ఇంగ్లాండ్ కు కలిసి వచ్చింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 471 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ 364 పరుగులకు ఆలౌటైంది. మరోవైపు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 465 పరుగులకు ఆలౌటైంది.