IND vs ENG 2025: ఐపీఎల్ ప్రతి ఏడాది వస్తుంది.. ఇంగ్లాండ్‌లో సిరీస్ గెలవడం ముఖ్యం: గిల్

IND vs ENG 2025: ఐపీఎల్ ప్రతి ఏడాది వస్తుంది.. ఇంగ్లాండ్‌లో సిరీస్ గెలవడం ముఖ్యం: గిల్

టీమిండియా యువ సంచలనం శుభమాన్ గిల్ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నాడు. రోహిత్ శర్మ తర్వాత భారత టెస్ట్ జట్టును ముందుకు తీసుకువెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. శుక్రవారం (జూన్ 20) ఇంగ్లాండ్ తో భారత్ 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ మెగా సిరీస్ గిల్ కు అగ్ని పరీక్షగా మారింది. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ లోనూ గిల్ రాణించాల్సి ఉంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ పిచ్ లపై గిల్ విఫలమవుతాడనే తీవ్ర విమర్శలు ఉన్నాయి. 25 ఏళ్లకే కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న గిల్ భారత టెస్ట్ జట్టుకు ఓవరాల్ గా 37వ కెప్టెన్. ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ కు ముందు గిల్ కెప్టెన్ గా తొలిసారి మీడియాతో మాట్లాడాడు.

ఇంటర్వ్యూలో భాగంగా గిల్ కెప్టెన్‌గా తన లక్ష్యాలను వెల్లడించాడు. " కెప్టెన్ గా అవకాశం దక్కడం గొప్ప గౌరవం. ఇది ఒక ఆటగాడికి లభించే అతిపెద్ద గౌరవం. టెస్ట్ క్రికెట్‌లో దేశానికి కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం అందరికీ రాదు. ఆ విషయంలో నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఐపీఎల్ ప్రతి ఏడాది వస్తుంది. నా అభిప్రాయం ప్రకారం.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలవడం ముఖ్యం". అని గిల్ అన్నాడు. ఈ సిరీస్ లో తన దృష్టి అంతా బ్యాటింగ్ పైనే ఉంటుందని.. కెప్టెన్సీ గురించి ఎక్కువగా ఒత్తిడి తీసుకోలేనని గిల్ తెలిపాడు.

ఒక ఆటగాడిగా ఇంకా ఎదుగుతున్న దశలోనే ఇంగ్లండ్‌‌లో ఇండియా టెస్ట్ జట్టుకు కెప్టెన్సీ చేపట్టడం అనే కఠినమైన బాధ్యతను శుభ్‌‌మన్ గిల్ స్వీకరించాడు. ఇది తనపై మామూలు భారం కాదు.  స్వదేశంలో అతని టెస్టు సగటు 42.03 బాగానే ఉంది. కానీ,  విదేశాల్లో (29.50) మాత్రం తేలిపోతున్నాడు. పైగా, ఇంగ్లండ్‌‌లో ఆడిన 3 టెస్టుల్లో కేవలం 14.66 సగటుతో 88 రన్స్‌‌ మాత్రమే చేశాడు. దాంతో ఈ సిరీస్‌‌ అతని బ్యాటింగ్ టెక్నిక్‌‌కే కాకుండా మానసిక స్థైర్యానికి పెద్ద పరీక్ష అవుతుంది. తను క్రీజులో ఎంతసేపు నిలబడతాడన్న దానికంటే ఒత్తిడిలో జట్టును ఎలా నడిపిస్తాడన్న దానిపైనే అందరి దృష్టి ఉంటుంది. 

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒక దశాబ్దానికి పైగా టీమిండియా టెస్టు జట్టుకు మహాస్తంభాలుగా నిలిచారు. బ్యాటర్లుగానే కాకుండా నాయకులుగా ఎన్నో గొప్ప విజయాలు అందించారు. ఇప్పుడు ఈ ఇద్దరూ లేకుండా ఒక దశాబ్దం తర్వాత టీమిండియా  అత్యంత కఠినమైన ఇంగ్లండ్ టూర్‌‌‌‌కు సిద్ధమైంది. ఈ కీలక సమయంలో ముగ్గురు ఆటగాళ్లు - కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్‌‌మన్ గిల్ ఇంగ్లండ్‌‌లోని కఠిన పరిస్థితులలో ఇండియా బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలవనున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Cric Crak (@criccrak_)