యోసు (కొరియా): ఇండియా స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ కొరియా ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే ఓడి నిరాశ పరిచారు. హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్ ముందంజ వేశారు. విమెన్స్ సింగిల్స్లో 17వ ర్యాంక్కు పడిపోయిన సింధు బుధవారం జరిగిన తొలి రౌండ్లో 18–21, 21–10, 13–21తో 22వ ర్యాంకర్ పై యు పొ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడింది. మెన్స్ సింగిల్స్లో శ్రీకాంత్ 21–12, 22–24, 17–21తో మాజీ వరల్డ్ నంబర్ వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. కెంటో చేతిలో అతనికి ఇది వరుసగా 12వ ఓటమి కావడం గమనార్హం. మరో మ్యాచ్లో ఐదో సీడ్ ప్రణయ్ 21–13, 21–17తో జులియెన్ కరాగి (బెల్జియం)పై గెలిచాడు. 32వ ర్యాంకర్ రజావత్ 21–15, 21–19తో లోకల్ ప్లేయర్ చొయి జి హూన్ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్లో సిక్కిరెడ్డి–రోహన్ రెండో రౌండ్ చేరగా, సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది.