- 2018లోనే పేపర్ల లీక్ స్కెచ్!
- ఆ ఏడాది ప్రవీణ్, రాజశేఖర్ యాక్టివిటీస్పై సిట్ ఆరా
- అదే సమయంలో గురుకుల హిందీ పండిట్ పరీక్ష రాసిన రేణుక
- మూడో రోజు కొనసాగిన సిట్ విచారణ
- ప్రవీణ్, రాజశేఖర్ ఇండ్లలో సోదాలు
హైదరాబాద్, వెలుగు: పేపర్ల లీకేజీ కేసు ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ 2018లో టీఎస్పీఎస్సీలో చేరిన తర్వాత వారి కార్యకలాపాలపై సిట్ఆరా తీస్తోంది. 2018లో విడుదలైన నోటిఫికేషన్స్ కు సంబంధించిన పేపర్స్ను కూడా లీక్ చేశారా? అనే కోణంలో వారిని ప్రశ్నించినట్లు తెలిసింది. అదే సమయంలో గురుకుల హిందీ టీచర్గా రేణుక పరీక్ష రాసిందని, రిజల్ట్స్లో తలెత్తిన సమస్య వల్ల ప్రవీణ్ను కలిసిందని, అప్పటి నుంచి వారి మధ్య పరిచయం పెరిగిందని సిట్ భావిస్తోంది.
ఆ తర్వాత రేణుక ఎంత మందిని ప్రవీణ్కు పరిచయం చేసిందనే వివరాలు రాబట్టినట్టు సమాచారం. ఈ మేరకు రేణుక, ప్రవీణ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు తెలిసింది. అలాగే టీఎస్పీఎస్సీ సర్వర్, ఆఫీస్లో సిస్టమ్ ఆపరేషన్స్కు సంబంధించి రాజశేఖర్ నుంచి వివరాలు సేకరించింది. కస్టడీలో భాగంగా మూడో రోజు సోమవారం కూడా నిందితులను సిట్ అధికారులు విచారించారు. ప్రవీణ్, రాజశేఖర్ ఇండ్లలో సోదాలు చేసి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో హిమాయత్నగర్లోని సిట్ఆఫీస్కు వారిని తరలించారు. సీసీఎస్లోని మిగతా ఏడుగురు నిందితులను కూడా సిట్ ఆఫీస్కు తీసుకొచ్చి ప్రశ్నించారు. ఒక్కొక్కరినీ క్రాస్ క్వశ్చనింగ్ చేశారు. ప్రవీణ్, రేణుక బ్యాంక్ లావాదేవీలు పరిశీలించారు. వాట్సప్ డేటా ఆధారంగా రాజశేఖర్ను ప్రశ్నించారు. గ్రూప్1 పేపర్ లీక్పై ప్రవీణ్ నుంచి ఆధారాలు సేకరించారు.
సెక్షన్ ఆఫీసర్ సిస్టమ్లో జూన్లోనే గ్రూప్1 పేపర్
సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి సిస్టమ్ నుంచి క్రియేట్ చేసిన స్టాటిక్ ఐపీ ద్వారా ఎక్కడెక్కడ యాక్సెస్ చేశారనే వివరాలు రాబడుతున్నారు. శంకరలక్ష్మి సిస్టమ్ ల్యాన్ నుంచి ఎన్ని కంప్యూటర్లను కనెక్ట్ చేశారనే వివరాలు సేకరించారు. అక్టోబర్లో జరిగిన గ్రూప్1 క్వశ్చన్ పేపర్ జూన్లోనే శంకరలక్ష్మి సిస్టంలోకి వచ్చింది. అదే సమయంలో రాజశేఖర్ ఆఫీస్ సిస్టమ్స్ అప్డేట్ చేశాడు. ఈ క్రమంలోనే శంకరలక్ష్మి సిస్టమ్ నుంచి గ్రూప్ 1 పేపర్ హ్యాక్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ పేపర్ను ప్రవీణ్, రాజశేఖర్ తమకు తెలిసిన వారికి షేర్ చేసినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రవీణ్, రాజశేఖర్ వద్ద స్వాధీనం చేసుకున్న 4 పెన్డ్రైవ్స్ డేటాను కూడా రికవర్ చేశారు. ప్రవీణ్ పెన్డ్రైవ్లో ఇప్పటికే ఐదు పేపర్స్ను గుర్తించగా.. మిగతా 3 పెన్డ్రైవ్స్లో ఏం సమాచారం ఉందనే వివరాలు రాబడుతున్నారు. పెన్డ్రైవ్స్లో పేపర్స్ను ఎవరికి షేర్ చేశారనే వివరాలు సేకరిస్తున్నారు. లీకేజీపై తనపై అనుమానం రాకుండా ఉండేందుకే ప్రవీణ్ రాంగ్ బబ్లింగ్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.