
- ట్రై నేషన్స్ సిరీస్ విన్నర్ ఇండియా
- ఫైనల్లో 97 రన్స్ తేడాతో శ్రీలంకపై గెలుపు
- రాణా, అమన్జ్యోత్ సూపర్ బౌలింగ్
కొలంబో: ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న ఇండియా విమెన్స్ టీమ్.. ట్రై నేషన్స్ వన్డే సిరీస్ను సొంతం చేసుకుంది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (101 బాల్స్లో 15 ఫోర్లు, 2 సిక్స్లతో 116) సూపర్ సెంచరీకి తోడు హర్లీన్ డియోల్ (56 బాల్స్లో 4 ఫోర్లతో 47), జెమీమా రొడ్రిగ్స్ (29 బాల్స్లో 4 ఫోర్లతో 44) దంచికొట్టడంతో.. ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 97 రన్స్ తేడాతో శ్రీలంక విమెన్స్ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇండియా 50 ఓవర్లలో 342/7 స్కోరు చేసింది.
హర్మన్ప్రీత్ కౌర్ (41) ఫర్వాలేదనిపించింది. తర్వాత లంక 48.2 ఓవర్లలో 245 రన్స్కే ఆలౌటైంది. చామరి ఆటపట్టు (51) టాప్ స్కోరర్. నీలాక్షిక సిల్వ (48), విష్మీ గుణరత్నే (36) పోరాడినా ఫలితం లేకపోయింది. స్నేహ్ రాణా 4, అమన్జోత్ 3 వికెట్లతో లంకకు అడ్డుకట్ట వేశారు. మంధానకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, టోర్నీ మొత్తంలో 15 వికెట్లు తీసిన స్నేహ్ రాణాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
అందరూ సమష్టిగా..
తేమతో కూడిన వాతావరణంలో ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇండియాకు మంధాన బలమైన పునాది వేసినా మిగతా బ్యాటర్లు కూడా సమష్టిగా ఆడి జట్టుకు భారీ స్కోరు అందించారు. 21 రన్స్ వద్ద క్యాచ్ ఔట్ నుంచి బయటపడ్డ మంధాన ఓ ఎండ్లో స్థిరంగా రన్స్ సాధించింది. ఉన్నంతసేపు వేగంగా ఆడిన ప్రతీకా రావల్ (30) తొలి వికెట్కు 70 రన్స్ జోడించి ఔటైంది. తర్వాత వచ్చిన హర్లీన్ డియోల్, మంధానతో పోటీపడి రన్స్ చేసింది. లాంగాఫ్, లాంగాన్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన మంధాన స్వీప్ షాట్స్, స్క్వేర్ కట్స్తో ఆకట్టుకుంది.
ఈ క్రమంలో 32వ హాఫ్ సెంచరీని పూర్తి చేయగా, వికెట్ల మధ్య చురుకుగా పరుగెత్తిన డియోల్ మంచి సహకారం అందించింది. చామరి వేసిన 31వ ఓవర్లో వరుసగా నాలుగు బౌండ్రీలు రాబట్టిన మంధాన 92 బాల్స్లో కెరీర్లో 11వ వన్డే సెంచరీని పూర్తి చేసింది. క్రీజులో పాతుకుపోయిన ఈ జంటను 33వ ఓవర్లో విహాంగ (2/69) విడగొట్టింది. లాఫ్టెడ్ కవర్ డ్రైవ్ ఆడే క్రమంలో మంధాన ఔటైంది. దీంతో రెండో వికెట్కు 120 రన్స్ భాగస్వామ్యం ముగిసింది.
హర్మన్ప్రీత్ నెమ్మదిగా ఆడినా కొద్దిసేపటికే హర్లీన్ వెనుదిరగడంతో మూడో వికెట్కు 29 రన్స్ జతయ్యాయి. 219/3 వద్ద వచ్చిన జెమీమా మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. నాలుగో వికెట్కు 48 రన్స్ జోడించి హర్మన్ ఔట్కాగా, రిచా ఘోష్ (8) నిరాశపర్చింది. చివర్లో అమన్జోత్ (18), దీప్తి శర్మ (20 నాటౌట్) ఏడో వికెట్కు 37 రన్స్ జత చేశారు. ఓవరాల్గా చివరి 10 ఓవర్లలో 90 రన్స్ రావడంతో ఇండియా భారీ టార్గెట్ను నిర్దేశించింది. మల్కి మదర, సుగంధిక చెరో రెండు వికెట్లు తీశారు.
చామరి, నీలాక్షిక పోరాడినా..
భారీ ఛేజింగ్లో లంక అమ్మాయిలు తడబడ్డారు. ఇన్నింగ్స్ మూడో బాల్కే హాసిని పెరీరా (0)ను ఔట్ చేసి ఇచ్చిన ఆరంభాన్ని స్నేహ్ రాణా కొనసాగించింది. ఈ దశలోచామరి, విష్మీ గుణరత్నే (36) నెమ్మదిగా ఆడి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. కానీ దీప్తి వరుసగా మూడు ఓవర్లలో తక్కువ రన్స్ ఇవ్వడంతో ఈ జంటపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో అమన్జోత్ బౌలింగ్లో భారీ షాట్ కొట్టబోయి విష్మీ వెనుదిరగడంతో రెండో వికెట్కు 68 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. 25 రన్స్ వద్ద చామరి ఇచ్చిన క్యాచ్ను వికెట్ కీపర్ రిచా ఘోష్ వదిలేసింది. ఆ వెంటనే తన బౌలింగ్లో నీలాక్షిక ఇచ్చిన క్యాచ్ను క్రాంతి గౌడ్ మిస్ చేసింది.
22వ ఓవర్లో తన బౌలింగ్లో చామరి క్యాచ్ను స్నేహ్ రాణా వదిలేసింది. అయితే 63 బాల్స్లో ఫిఫ్టీ కొట్టిన చామరిని 24వ ఓవర్లో ఔట్ చేసి ప్రతీకారం తీర్చుకుంది. ఇక హర్షిత (28)తో నాలుగో వికెట్కు 52 రన్స్ జోడించిన నీలాక్షిక ఇన్నింగ్స్ను ఆదుకునే ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు. విహాంగ (4), వత్సల (9), మల్కి మదర (0) నిరాశపర్చారు. చివర్లో అనుష్క (28), సుగంధిక (27) ఏడో వికెట్కు 53 రన్స్ జోడించినా టార్గెట్ను అందుకోలేకపోయారు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 50 ఓవర్లలో 342/7 (స్మృతి మంధాన 116, హర్లీన్ 47, జెమీమా 44, సుగంధిక 2/59). శ్రీలంక: 48.2 ఓవర్లలో 245 ఆలౌట్ (చామరి 51, నీలాక్షిక సిల్వ 48, స్నేహ్ రాణా 4/38, అమన్జోత్ 3/54).