యునెస్కో రేసులో రామప్ప ఆలయం

యునెస్కో రేసులో రామప్ప ఆలయం
  • అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాం: మంత్రి సత్యవతి రాథోడ్

వెంకటాపూర్(రామప్ప), వెలుగు: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు కోసం మన దేశం రెండు ప్రపోజల్స్ పంపగా అందులో రామప్ప దేవాలయం ముందు వరుసలో ఉందన్నారు. శనివారం రామప్ప ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టెంపుల్ పరిసరాలను పరిశీలించి చేపట్టాల్సిన పనులపై ఆరా తీశారు. 800 ఏండ్ల కిందే ఎంతో టెక్నాలజీతో రామప్ప దేవాలయాన్ని నిర్మించారని గుర్తు చేశారు. ఇలాంటి నిర్మాణం మరెక్కడా లేదన్నారు. పల్లెప్రగతి వల్ల గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయని, అంటువ్యాధులు దూరం అయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అడిషనల్ కలెక్టర్ ఆదర్శ్​సురభి, ఏఎస్పీ సాయి చైతన్య తదితరులున్నారు.
రామప్పను దర్శించుకున్న ఏపీ లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్​రెడ్డి
రామప్ప దేవాలయాన్ని శనివారం ఏపీ లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీరామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట తహసీల్దార్ మంజుల, ఎస్ఐ రమేశ్, రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, టూరిజం ఆఫీసర్లు ఉన్నారు.