
- కోటిన్నర మంది భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు
- 6 వేల ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులకు ఆదేశం
- సమ్మక్క సారక్క జాతరపై అధికారులతో మంత్రుల రివ్యూ
హైదరాబాద్, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంతాన్ని10 జోన్లుగా డివైడ్ చేసి, ప్రతి జోన్ కు అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భక్తులందరూ వన దేవతలను ప్రశాంతంగా దర్శించుకుని తిరిగి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు సమ్మక్క సారక్క జాతరపై జూబ్లీహిల్స్ ఎంసీహెచ్ఆర్డీలో మంగళవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క సీఎస్, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రభుత్వం జాతర నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, నిర్వహణ కోసం ఇప్పటికే రూ.75 కోట్ల నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. జాతరలో గిరిజన, ఆదివాసీ సంప్రదాయ నృత్యాలతో పాటు ఇతర రాష్ట్రాల కళాకారుల బృందాలతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు స్నానాలకు ఇబ్బంది లేకుండా జంపన్న వాగులో నీరు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో కంటే మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. తాగునీరు ఇతర వసతుల కల్పనపై దృష్టి సారించాలన్నారు. సామాన్య భక్తుల క్యూలైన్లు, భారీకేడ్ల ఏర్పాటు చేయాలన్నారు.
సమన్వయంతో పని చేయాలి: పొన్నం
మేడారం జాతర పనులు త్వరితగతిన పూర్తికావడానికి జిల్లా కలెక్టర్లు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. గతంలో అక్కడ పని చేసిన అధికారులకు జాతర ఏర్పాట్ల భాధ్యతలు అప్పగిస్తే సమస్యలు తలెత్తవన్నారు. ట్రాఫిక్ జామ్, రూట్ క్లియరెన్స్ కోసం ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలన్నారు.
ఈసారి జాతరకు కోటి 50 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళా భక్తుల రద్దీ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈసారి 6 వేల బస్సులు నడిపించడానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేయాలన్నారు. జాతర కోసం అదనంగా బస్సులు వేయడం వల్ల 3 రోజుల పాటు హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రైవేట్ బస్సులు , స్కూల్ బస్సులు ఏర్పాటు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
జాతరలో ప్లాస్టిక్ వద్దు: సీతక్క
మేడారంలో ఈసారి ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించాలని మంత్రి సీతక్క ఆదేశించారు.పర్యావరణ పరిరక్షణకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. అటవీ ప్రాంతాన్ని సంరక్షించడంతో పాటు అటవీ జంతువులకు హాని కలుగకుండా చూడాలన్నారు. రహదారులకు ఇరువైపులా ఆర్అండ్బీ అధికారులు నేమ్ ప్లేట్లను ఏర్పాటు చేయాలని, మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
గర్భిణులకు, చిన్నారులకు ప్రత్యేకంగా బాలామృతం అందించాలని అధికారులను ఆదేశించారు. గిరిజన, ఆదివాసీ సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. టూరిజం అభివృద్ధి చెందటానికి తగిన బస్సులను నడపాలన్నారు. మహా జాతర విశిష్టతను డాక్యుమెంటరీగా రూపొందించాలన్నారు.