కరోనా టెస్ట్ల కోసం ఉపయోగిస్తున్న ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ వినియోగాన్ని రెండు రోజుల పాటు ఆపేయాలని పలు రాష్ట్రాలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచించింది. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఉపయోగించే ఈ కిట్లలో చాలా వ్యత్యాసాలు ఉన్నందున, కొత్త కిట్లను పరీక్షించి, ధ్రువీకరించాల్సి ఉందని , మరో రెండ్రోజుల్లో మళ్లీ దీనిపై మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఐసీఎంఆర్ తెలిపింది.
వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ర్యాపిడ్ కిట్లు 90 శాతం కచ్చితమైన ఫలితాన్ని ఇస్తాయని అంచనా వేస్తుండగా.. కేవలం 5.4 శాతం మాత్రమే కచ్చితమైన ఫలితాన్ని ఇస్తున్నాయని రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ ఐసీఎంఆర్ కు కంప్లయింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. వీటి వినియోగాన్ని రెండు రోజుల పాటు ఆపేయాలని ఐసీఎంఆర్ సూచించింది.
కేంద్ర ఆరోగ్య శాఖ దీనిపై స్పందిస్తూ.. ఈ కిట్ల ద్వారా తప్పుడు ఫలితాలు వస్తున్నాయంటూ ఫిర్యాదు వచ్చినందున ప్రస్తుతానికి రాష్ట్రాలు వాటిని ఉపయోగించవద్దని సూచించింది. రెండు రోజుల్లో కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.