ENG vs IND 2025: ఒప్పించాల్సిన బాధ్యత నీదే.. బుమ్రా భార్యకు గవాస్కర్, పుజారా స్పెషల్ రిక్వెస్ట్

ENG vs IND 2025: ఒప్పించాల్సిన బాధ్యత నీదే.. బుమ్రా భార్యకు గవాస్కర్, పుజారా స్పెషల్ రిక్వెస్ట్

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో ఎంత కీలక ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  మూడు ఫార్మాట్ లలో నిలకడగా రాణించే అతి కొద్ది మంది బౌలర్లలో బుమ్రా ఒకడు. తన పదునైన యార్కర్లు, స్వింగ్, బౌన్స్ తో ఎంతటి స్టార్ బ్యాటర్ నైనా బోల్తా కొట్టిస్తాడు. ప్రపంచ స్టార్ బ్యాటర్లు సైతం ఈ యార్కర్ల వీరుడిని ఎదుర్కొనడానికి ఇబ్బంది పడతారు. టెస్ట్ ఫార్మాట్ లో నెంబర్ వన్ బౌలర్ గా దూసుకెళ్తున్న బుమ్రా.. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో అదరగొట్టాడు. లీడ్స్ వేదికగా ఆసక్తికరంగా సాగుతున్న ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ పై 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. 

రెండో రోజు ఆటలో భాగంగా మూడు కీలక వికెట్లు తీసుకోగా.. మూడో రోజు మరో రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్ట్ కెరీర్ లో 14 వ సారి 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఓవరాల్ గా బుమ్రా తొలి ఇన్నింగ్స్ లో 24.4 ఓవర్లు బౌలింగ్ చేసి 83 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్ లో టీమిండియా గెలవాలంటే బుమ్రా చాలా కీలకం. అయితే బుమ్రా ఇంగ్లాండ్ పర్యటనలో కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడతానని ఇప్పటికే చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. బుమ్రా ప్రదర్శన చూస్తుంటే ఈ స్టార్ పేసర్ అన్ని టెస్టులు ఆడితే బాగుండు అని ప్రతి భారత క్రికెట్ ఫ్యాన్ కోరిక. 

కామెంట్రీలో భాగంగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్, ది వాల్ చటేశ్వర్ పుజారా బుమ్రా సిరీస్ లోని అన్ని టెస్టుల ఆడాలనే తమ కోరికను బయటపెట్టారు. బుమ్రా ఈ సిరీస్ లో ఐదు ఆడేలా ఒప్పించాలని బుమ్రా భార్య సంజన గణేషన్‌ ను కోరారు. పనిభారం ఉన్నప్పటికీ అతను సిరీస్ మొత్తం ఆడాలని తమ వాదనను వినిపించారు. వీరి మాటలకు సంజయ్ గణేశన్ నవ్వుకున్నారు. ప్రస్తుతానికైతే బుమ్రా అన్ని టెస్టులు ఆడతాడో లేదో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న లీడ్స్ టెస్ట్ ఆసక్తికరంగా మారింది. నాలుగో రోజు తొలి సెషన్ లో భారత్ నిలకడగా ఆడడంతో లంచ్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. రాహుల్ (72), రిషబ్ పంత్ (31) క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 6 పరుగులు కలుపుకొని 159 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 471.. ఇంగ్లాండ్ 465 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.