
ముంబై: టీమిండియా, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ టీ20 ఫార్మాట్లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. పొట్టి ఫార్మాట్లో వరుసగా 14 సార్లు 25 ప్లస్ స్కోర్ చేసిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డ్ దక్షిణాఫ్రికా సౌతాఫ్రికా బ్యాటర్ టెంబా బవుమా పేరిట ఉండేది. బవుమా వరుసగా 13 సార్లు 25 ప్లస్ పైగా పరుగులు చేశాడు.
ఐపీఎల్ 18లో భాగంగా సోమవారం (మే 26) పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచులో బవుమా వరల్డ్ రికార్డ్ను సూర్యకుమార్ యాదవ్ బద్దలు కొట్టాడు. వీరిద్దరి తర్వాత కైల్ మేయర్స్, క్రిస్ లిన్, కుమార్ సంగక్కర, జాక్వెస్ రుడాల్ఫ్, బ్రాడ్ హాడ్జ్ వరుసగా 11 స్కోర్లు25కి పైగా రన్స్ చేసి తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఇక, ఈ మ్యాచులో సూర్య హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 39 బంతుల్లో ఆరు ఫోర్లు, 2 సిక్సర్లు బాది 57 పరుగులు చేశాడు.
సూర్య హాఫ్ సెంచరీతో రాణించినప్పటికీ ఈ మ్యాచులో ముంబై ఓటమి పాలైంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు చేరడంలో సూర్యది కీలక పాత్ర. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించి.. ముంబై విజయాల్లో స్కై కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 13 మ్యాచులు ఆడిన సూర్య 170 స్ట్రైక్ రేట్తో 583 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు.