
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ కు ఐపీఎల్ 2025లో తిరుగులేకుండా పోతుంది. ఈ సీజన్లో తనదైన శైలిలో చెలరేగుతున్నాడు. ఈ మెగా టోర్నీలో ఎవరూ చూపించని నిలకడ చూపిస్తున్నాడు. సోమవారం (మే 26) పంజాబ్ కింగ్స్ జరిగిన మ్యాచ్ లో 37 బంతుల్లో 55 పరుగులు చేసి ఈ సీజన్ లో ఇప్పటివరకు 640 పరుగులు చేసి దూసుకెళ్తున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ తరపున ఒక ఆల్ టైం రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే సీజన్ లో ముంబై తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు ఈ రికార్డ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.
2010 ఐపీఎల్ లో సచిన్ 618 పరుగులు చేశాడు. నేడు (మే 26) సూర్యఈ రికార్డ్ బ్రేక్ చేసి 640 పరుగులతో టాప్ కు చేరుకున్నాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సూర్య హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఇదే సీజన్ లో సూర్య అంతకముందు ముంబై తరపున మరో రికార్డ్ బ్రేక్ చేశాడు.సూర్య ఒకే సీజన్ లో 500 పరుగులు చేయడం ద్వారా ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక సీజన్ లలో 500 పరుగుల మార్క్ అందుకున్న ప్లేయర్ గా సూర్య రికార్డ్ సృష్టించాడు. ముంబై ఇండియన్స్ తరపున సచిన్, డికాక్ ఒకే సీజన్ లో 500 పరుగుల మార్క్ ను రెండు సార్లు చేశారు.
సచిన్ 2010, 2011లో 500 పరుగులు చేయగా.. డి కాక్ 2019, 2020లో 500+ పరుగుల మార్క్ అందుకున్నాడు. ఇక సూర్య 2018, 2023 లో 500 పరుగుల మార్క్ టచ్ చేయగా.. ప్రస్తుత సీజన్ లో 500 పరుగుల మార్క్ ను అధిగమించాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ముంబై బ్యాటింగ్ లో రాణించింది. సూర్య కుమార్ యాదవ్ (39 బంతుల్లో 57:6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో మరోసారి ముంబైకి ఆపద్బాంధవుడయ్యాడు. దీంతో హార్దిక్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో మార్కో జాన్సెన్, విజయ్ కుమార్ వైశుక్, అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టారు. హరిప్రీత్ బ్రార్ కు ఒక వికెట్ దక్కింది.