అసెంబ్లీ ఎన్నికలకు ముందు ట్రాన్స్ఫర్ చేసిన తహసీల్దార్లను తిరిగి పాత స్థానాలకు పంపాలనే డిమాండ్తో తెలంగాణ తహసీల్దార్ల సంఘం (టీజీటీఏ) మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ‘వర్క్ టు రూల్’ చేపట్టింది. ఉదయం 10.30కు ఆఫీస్లకొచ్చిన తహసీల్దార్లు సాయంత్రం 5 గంటలకే డ్యూటీ ముగించుకుని ఇంటిబాట పట్టారు. వివిధ సర్టిఫికెట్ల అప్రూవల్, ఫైళ్ల క్లియరెన్స్ నిమిత్తం రోజూ రాత్రి 9 గంటల వరకు ఆఫీసుల్లోనే ఉండే తహసీల్దార్లు 5 గంటలకే వెళ్లిపోవడంతో కార్యాలయాలన్నీ బోసిపోయి కన్పించాయి. టీజీటీఏ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా 758 మంది తహసీల్దార్లు ఈ నిరసనలో పాల్గొన్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిశాక తహసీల్దార్లను పాత జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయడం ఆనవాయితీ అని, ఈ సారి కూడా ప్రభుత్వం ఆ విధంగానే చేస్తుందనే ఉద్దేశంతోనే ఫ్యామిలీలను షిఫ్ట్ చేసుకోలేదన్నారు. ప్రస్తుతానికి కుటుంబం ఓ చోట, తాము మరో చోట ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట భాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఫూల్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు.
రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి
తహసీల్దార్ల బదిలీలు చేపట్టాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ల బృందం రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీని మంగళవారం కలిసింది. ట్రాన్స్ఫర్ల విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా రెండు, మూడు రోజుల్లో చేస్తామని హామీ ఇచ్చినట్లు రవీందర్ రెడ్డి తెలిపారు.
స్పెషలాఫీసర్ డ్యూటీ నుంచి తొలగింపు
18 మున్సిపాలిటీలకు స్పెషలాఫీసర్లుగా కొనసాగుతున్న తహసీల్దార్లను ఆ డ్యూటీల నుంచి తప్పిస్తూ మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వారి స్థానంలో ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలకు బాధ్యతలు అప్పగించారు. తమను పాత జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయాలని తహసీల్దార్లు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టడం, మంగళవారం నుంచి వర్క్ టు రూల్, ఆ తర్వాత మాస్ లీవ్లకు సిద్ధం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసిన నేపథ్యంలో తహసీల్దార్లు స్పెషలాఫీసర్లుగా ఉన్న పట్టణాల్లో ఎలాంటి సమస్య తలెత్తకుండా చూసేందుకే వారి స్థానంలో ఎంపీడీఓలను నియమించారనే చర్చ జరుగుతోంది. ఎంపీడీఓలకు స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు అప్పగించిన మున్సిపాలిటీల్లో జగిత్యాల జిల్లా రాయికల్, ధర్మపురి, నారాయణపేట జిల్లా మక్తల్, మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్, కోస్గి, మంచిర్యాల, మేడ్చల్ జిల్లా తూముకుంట, నల్గొండ జిల్లా నందికొండ, నిర్మల్ జిల్లా ఖానాపూర్, చిట్యాల, హాలియా, చండూర్, రంగారెడ్డి జిల్లా ఆమనగల్, సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, తిరుమలగిరి, యాదాద్రి జిల్లా పోచంపల్లి, యాదగిరిగుట్ట, వనపర్తి జిల్లా అమరచింత ఉన్నాయి.