తమిళనాడులో ఉగ్రవాదులు చొరబడినట్లు తెలుస్తోంది. నిఘా వర్గాల హెచ్చరికలతో తమిళనాడులో హైఅలర్ట్ ప్రకటించింది. పాకిస్థాన్ కేంద్రంగా పని చేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులోకి చొరబడి ….కొయంబత్తూర్ లో దాగి ఉన్నట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్థానీ, మరో ఐదుగురు శ్రీలంకకు చెందినవారిగా తెలుస్తోంది. రద్దీ ప్రదేశాలు, విదేశీ రాయబార కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు , ఆలయాలను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరికలు జారీ చేసింది.
ఐబీ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. కొయంబత్తూర్ లో హై అలర్ట్ ప్రకటించారు. నగరంలోని అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అటు చెన్నైలో బలగాలను పెంచారు . ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్ , బస్ స్టాండ్ , ఆలయాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. తీర ప్రాంత జిల్లాలన్నింటికీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి చోటును ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.