
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఏ మాత్రం సంతోషంగా లేరని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ నిరంకుశ విధానాలను ఎండగడుతూ గ్రామ స్థాయి నుంచి టీడీపీని బలోపేతం చేయాలని పార్టీ నాయకులకు ఆయన పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మం జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ పాల్వంచ రామారావు ఆధ్వర్యంలో 100 మంది జ్ఞానేశ్వర్ సమక్షంలో టీడీపీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా టీడీపీకి కంచుకోట అని, వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను గెలిచే దిశగా సిద్ధం కావాలని పార్టీ నాయకులకు సూచించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సభలు విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. బీసీ జేఏసీ నేతలు టీవీ రాజు, ఎం.శ్రీనివాస్, సీపీఎం నేత, రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ రాఘవులు, బీఆర్ఎస్ నాయకులు చల్ల రామకృష్ణ, నాగేంద్ర చారి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్వర్లు తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ అబ్జర్వర్ కూరపాటి వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కనగాల సాంబశివరావు, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కాప కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.