
సిమ్లా: స్కూల్ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఓ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లాలోని గవర్నమెంట్ స్కూల్ లో ఈ ఘటన జరిగింది. రాజ్ గఢ్ జిల్లాలోని గవర్నమెంట్ మోడల్ సీనియర్ సెకండరీ స్కూల్ లో మ్యాథ్స్ బోధిస్తున్న ఉపాధ్యాయుడు తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని 8 నుంచి10వ తరగతికి చెందిన 24 మంది విద్యార్థినులు స్కూల్ ప్రిన్సిపల్ కాంతాదేవికి ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల ఫిర్యాదును ఆమె లైంగిక వేధింపుల నిరోధక కమిటీకి పంపడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు.
బాలికలపై వేధింపులకు పాల్పడినట్టు తేలితే ఆ ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. లైంగిక వేధింపుల గురించి తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.