
లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతోన్న తొలి టెస్ట్లో టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ దుమ్మురేపాడు. కెప్టెన్గా ఆడిన తొలి మ్యాచులోనే అద్భుత సెంచరీ సాధించాడు. 140 బంతుల్లో 14 ఫోర్లు బాది సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఓవరాల్గా టెస్టుల్లో గిల్కు ఇది ఆరవ సెంచరీ. ఈ మ్యాచులో 4వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన గిల్ క్రీజులోకి రాగానే వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు.
ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ చూస్తుండగానే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం కాస్త ఆచితూచి ఆడాడు. చెత్త బంతులను బౌండరీకి తరలించాడు. ఒక్కో పరుగు జోడిస్తూ 140 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా గిల్ పలు రికార్డులు సృష్టించాడు. కెప్టెన్గా బరిలోకి దిగిన తొలి మ్యాచులోనే సెంచరీ బాదిన 23 ప్లేయర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. కోహ్లీ, రోహిత్ వంటి సీనియర్ ప్లేయర్స్ లేకుండా తొలి టెస్ట్ ఆడుతోన్న యువ భారత జట్టు ఆకట్టుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన భారత్కు ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్, కేఎల్ రాహుల్ అద్భుతమైన శుభారంభం అందించారు. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ యంగ్ ఓపెనర్ జైశ్వాల్ (101) అద్భుత సెంచరీతో రాణించాడు. కేఎల్ రాహుల్ కూడా (42) ఆకట్టుకున్నాడు. మూడో స్థానంలో బరిలోకి దిగిన సాయి సుదర్శన్ ఒక్కడే నిరాశపర్చాడు. అరంగ్రేట మ్యాచులోనే డకౌట్ అయ్యాడు.
సాయి సుదర్శన్ ఔట్ అయిన తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన గిల్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. పంత్ (46)తో కలిసి ఇన్సింగ్స్ ను ముందుకు తీసుకుపోతున్నాడు. ప్రస్తుతం టీమిండియా 78 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. గిల్ (112), పంత్ (46) క్రీజులో ఉన్నారు. జైశ్వాల్, గిల్ సెంచరీలతో రాణించడంతో ఫస్ట్ ఇన్సింగ్స్లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది.