
ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ ఓటమి తర్వాత టీమిండియా తీవ్ర నిరాశకు గురైంది. గెలిచే మ్యాచ్ ను చేజేతులా పోగొట్టుకుంది. లీడ్స్ వేదికగా హెడింగ్లీలో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసినా రెండో ఇన్నింగ్స్ లో భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచినా ఓటమి తప్పలేదు. భారీ స్కోర్ ఇంగ్లాండ్ ముందు నిర్ధేశించి చివరి వరకూ పోరాడినా గిల్ సేనకు విజయం దక్కలేదు. మ్యాచ్ లో ఓటములు సహజం. కానీ భారత జట్టు ఓటమి మాత్రం ఊహించనిది. ఈ మ్యాచ్ లో క్యాచ్ లు జారవిడవడం మైనస్ గా మారడంతో పాటు లోయర్ ఆర్డర్ చెత్త బ్యాటింగ్ కారణమైంది.
లీడ్స్ ఓటమిపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ స్పందించాడు. ఓటమి తర్వాత ప్రెస్తో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు "క్యాచ్లు వదిలేసినందుకు తాను ఎవరినీ నిందించడం లేదు. క్యాచ్లు డ్రాప్ అవుతాయి. క్రికెట్ లో ఇది చాలా సహజం. ఎవరూ ఉద్దేశపూర్వకంగా వాటిని డ్రాప్ చేసినట్లు కాదు" అని గంభీర్ అన్నాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా మొత్తం 10 క్యాచ్ లు మిస్ చేయడం ఓటమికి ప్రధాన కారణంగా మారింది. జైశ్వాల్ ఒక్కడే నాలుగు క్యాచ్ లు నేలపాలు చేయగా.. జడేజా, పంత్, కరుణ్ నాయర్ తలో క్యాచ్ విడిచారు.
బ్యాటింగ్ కుప్పకూలడంపై మాట్లాడుతూ .." బ్యాటింగ్ మమ్మల్ని నిరాశపరిచింది. తొలి ఇన్నింగ్స్లో మేము 40 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయాం. రెండో ఇన్నింగ్స్లో 30 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయాము. మొదటి ఇన్నింగ్స్లో 600 పరుగులు చేసే అవకాశం మాకు లభించింది. మేము ఎక్కువ స్కోర్ చేసి ఉంటే ఆధిపత్యం చెలాయించేవాళ్ళం. దీని నుండి మేము నేర్చుకుంటాం". అని గంభీర్ అన్నాడు.
"శార్దూల్ను మొదట స్పెషలిస్ట్ బౌలర్గా కాకుండా బౌలింగ్ ఆల్ రౌండర్గా తీసుకున్నారు. కొన్నిసార్లు, కెప్టెన్ తన సహజసిద్ధమైన అభిప్రాయాలను బట్టి వెళ్తాడు" అని గంభీర్ అన్నాడు. గిల్ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. " తొలి టెస్ట్ మ్యాచ్ కు కొన్ని భయాలు ఉంటాయి. గిల్ కు ఇది గొప్ప గౌరవం. ఇలాంటి అవకాశం చాలామందికి లభించదు. విజయవంతమైన కెప్టెన్ కావడానికి అతనికి కావలసినవన్నీ ఉన్నాయి. కానీ మనం గిల్ కు సమయం ఇవ్వాలి. సెంచరీ చేసి మ్యాచ్ ఓడిపోతే కెప్టెన్ కు చాల బాధగా ఉంటుంది. " అని గంభీర్ తెలిపాడు.