కవిత క్షమాపణ డిమాండ్పై స్పందించని పర్వేశ్ వర్మ

 కవిత క్షమాపణ డిమాండ్పై స్పందించని పర్వేశ్ వర్మ
  • కోర్టు నుండి ఎలాంటి నోటీసులు అందలేదు
  • సీబీఐ ప్రతి ఒక్కర్నీ విచారణకు పిలుస్తుంది

న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత క్షమాపణ డిమాండ్ పై పశ్చిమ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ స్పందించలేదు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నుండి నాకు ఎలాంటి నోటీసులు అందలేదు.. అందగానే స్పందిస్తానని అన్నారు. ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పరువునష్టం దావా కేసును నిన్న విచారించిన సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రతివాదులైన బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే ముజంధర్ సిర్సాలకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై సోషల్ మీడియాలోగాని, మీడియా ముందు ఎవరూ ఎలాంటి  వాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. కేసు విచారణను సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది.
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు జారీ చేసిన ఆదేశాలపై ఎంపీ పర్వేశ్ వర్మ ఇవాళ ఢిల్లీలో రియాక్ట్ అయ్యారు. కోర్టు నుండి నాకు ఎలాంటి నోటీసులు అందలేదని, అందిన తర్వాత స్పందిస్తా.. కాస్త వేచిచూడమని అన్నారు. ‘‘ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో మేము ఎవరి పేర్లు లేవనెత్తామో వారికి సీబీఐ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తుందన్నారు. లిక్కర్ స్కాంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సీబీఐ నోటీసులు ఇస్తుంది.. ప్రతి ఒక్కరినీ విచారణకు పిలుస్తుంది.. సిబిఐ విచారణలో మద్యానికి మద్యం.. పాలకు పాలు తెలిపోతాయి’’ అని పర్వేశ్ వర్మ పేర్కొన్నారు.