670 పంచాయతీలకు కొత్త బిల్డింగ్స్

670 పంచాయతీలకు కొత్త బిల్డింగ్స్
  •     670 గ్రామాల్లో పంచాయతీలకు భవనాలు లేవని సర్కారుకు ఆఫీసర్ల రిపోర్టు
  •     ఉపాధి హామీ ఫండ్స్​తో నిర్మించాలని సీఎం రేవంత్​ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో సొంత భవనాలు లేని గ్రామ పంచాయతీలకు కొత్త బిల్డింగ్ ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ర్టంలో12,769 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో 670 జీపీలకు సొంత భవనాలు లేవని ఇటీవల పంచాయతీ రాజ్​అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అందజేశారు. దీనిపై స్పందించిన సీఎం.. బిల్డింగ్ ల నిర్మాణాలకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందు కోసం ఉపాధి హామీ నిధులను వినియోగించుకోవాలన్నారు. ఒక్కో బిల్డింగ్ కు రూ.30 లక్షల చొప్పున అన్ని భవనాలకు కలిపి రూ.200 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.  

అద్దె భవనాల్లో కొనసాగుతూ..

రాష్ర్టంలో గతంలో 8500 గ్రామ పంచాయతీలు ఉంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా 4500 పైగా ఏర్పాటు చేసింది. వీటిలో 500 జనాభా దాటిన తండాలను జీపీలుగా మార్చింది. దీంతో కొత్త జీపీలకు భవనాల కొరత ఏర్పడగా, పాత జీపీల బిల్డింగ్ లు కూడా చాలా వరకు శిథిలావస్థకు చేరి కూలే దశకు వచ్చాయి. గత ప్రభుత్వంలో కొత్త జీపీ బిల్డింగ్స్ కు నిధులు విడుదల చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ సర్కారు నిధులు విడుదల చేయలేదు. దీంతో కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అలాంటి చోట్ల అద్దె కట్టని పంచాయతీలకు బిల్డింగ్స్ ఓనర్స్ నోటీసులు ఇవ్వడం, తాళాలు వేయడం తదితర ఘటనలు చోటుచేసుకున్నాయి. 

ఎంపీపీ, జడ్పీ బిల్డింగ్స్ పరిస్థితి..

రాష్ర్ట ప్రభుత్వం గత 10 ఏండ్లలో కొత్త మండలాలను ఏర్పాటు చేయటంతో పాటు10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేసింది. మండలాల్లో ఎంపీపీ ఆఫీసులకు కూడా బిల్డింగ్స్ లేకపోవటంతో చాలా చోట్ల అద్దెకు తీసుకోవటం, తాత్కాలికంగా ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు, మంత్రుల పర్యటనల సమయంలో, ఎంపీపీ మీటింగ్ ల టైమ్ లో చాలా ఇబ్బంది అవుతోందని ప్రజా ప్రతినిధులు గతంలో ఎన్నిసార్లు సర్కారుకు మొరపెట్టుకున్నా స్పందన రాలేదు. 562 మండలాలు ఉండగా 143 ఎంపీపీ ఆఫీసులకు బిల్డింగ్స్ లేవని అధికారులు చెబుతున్నారు. జిల్లా పరిషత్​లు 32 ఉండగా, 23 జడ్పీలకు బిల్డింగ్స్ లేవని ఇటీవల పంచాయతీ రాజ్  రివ్యూ టైమ్​లో సీఎంకు అధికారులు నివేదిక ఇచ్చారు. మండల పరిషత్​ బిల్డింగ్​లకు ఒక్కో దానికి రూ.3 కోట్ల చొప్పున రూ.286 కోట్లు, జిల్లా పరిషత్ బిల్డింగ్​లకు ఒక్కో దానికి రూ.7 కోట్లు చొప్పున రూ.161 కోట్ల నిధులు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. అయితే ముందుగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ల నిర్మాణం పూర్తయిన తర్వాత  ఎంపీపీ, జడ్పీ బిల్డింగ్ ల నిర్మాణం చేద్దామని సీఎం అన్నట్లు పీఆర్ అధికారులు చెబుతున్నారు.