మెంటల్​ హాస్పిటల్ వస్తలేదు

మెంటల్​ హాస్పిటల్ వస్తలేదు

మానసిక రుగ్మతలతో వస్తున్న వారికి ట్రీట్మెంట్​ అందిచేందుకు ఎంజీఎంలో 50 బెడ్లతో సైకియాట్రిక్​ వార్డు అందుబాటులో ఉండేది. కానీ కొవిడ్​సెకండ్​వేవ్​నుంచి ఆ వార్డులోని బెడ్లను కూడా కరోనా పేషెంట్లకే వినియోగిస్తున్నారు. దీంతో మెంటల్​ పేషెంట్లకు ప్రత్యేకమైన వార్డు అంటూ ఏమీ లేకుండా పోయింది. ఫలితంగా బాధితులకు డాక్టర్లు మందులు రాసిచ్చి పంపడం తప్ప.. ఇన్​ పేషెంట్​గా చేర్చుకుని ట్రీట్​మెంట్​అందించలేని స్థితిలో ఉన్నారు. ఒకవేళ ఎవరికైనా అత్యవసర చికిత్స అవసరమైతే మాత్రం హైదరాబాద్​ఎర్రగడ్డ ఆసుపత్రి లేదా ఇక్కడే ఏదైనా ప్రైవేటు హాస్పిటల్​కు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో సరైన స్టాఫ్, ఎక్విప్​మెంట్​లేకున్నా పేషెంట్లను అడ్మిట్​చేసుకుని అందిన కాడికి దండుకుంటున్నారు. ఇదిలా ఉంటే బాధితుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది ఎలాంటి పర్మిషన్లు లేకున్నా ‘డి అడిక్షన్’ సెంటర్లు రన్ చేస్తూ బాధితులను దోచుకుంటున్నారు.  ఈ క్రమంలో ఇప్పటికైనా వరంగల్ లో మెంటల్ హాస్పిటల్​ ఏర్పాటుకు స్థానిక లీడర్లు చొరవ తీసుకోవాలనే డిమాండ్​ వ్యక్తమవుతోంది. 

హనుమకొండ, వెలుగు:  వరంగల్​కు  కేంద్రం మంజూరు చేసిన ‘మెంటల్​ హెల్త్​ ఇనిస్టిట్యూట్’ను రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. ఉత్తర తెలంగాణ వైద్య అవసరాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎంకు మానసిక రోగుల సంఖ్య కొన్నేండ్లుగా పెరుగుతోంది. దీంతో  కాకతీయ మెడికల్​ కాలేజ్​డాక్టర్ల ప్రపోజల్స్​మేరకు నాలుగేండ్ల కింద కేంద్ర ప్రభుత్వం వరంగల్ కు ‘మెంటల్​హెల్త్​ఇనిస్టిట్యూట్’ శాంక్షన్​చేసింది. బిల్డింగ్​నిర్మాణానికి రూ.33 కోట్లు అవసరం కాగా, అదే ఏడాది మొదటి విడత రూ.17 కోట్లు రిలీజ్​ చేసింది. వాటిని ఖర్చు చేస్తే మిగతా ఫండ్స్​రిలీజ్​చేసేందుకు  రెడీగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  దీంతో కేంద్రం ఇచ్చిన ఫండ్స్​ కాస్త స్టేట్​ట్రెజరీలోనే మూలుగుతున్నాయి. ఫలితంగా ఉత్తర తెలంగాణకు చెందిన మానసిక రోగులను  ట్రీట్​మెంట్​ కోసం  హైదరాబాద్ తీసుకెళ్లడం పేద రోగులకు ఇబ్బందిగా మారింది. 

పెరుగుతున్న బాధితులు
రాష్ట్రంలో ఆల్కహాల్ తో పాటు గంజాయి, కొకైన్​ లాంటి డ్రగ్స్​వినియోగం పెరిగిపోతోంది. ఏజ్​ తో సంబంధం లేకుండా ఎంతోమంది మత్తుపదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాగిన మత్తులో వివిధ అకృత్యాలకు పాల్పడడంతోపాటు సూసైడ్​చేసుకుంటున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. వీరేగాక వివిధ కారణాలతో మానసిక రోగులుగా మారుతున్నవారు తెలంగాణవ్యాప్తంగా వేలల్లో ఉన్నారు. ఇలాంటి బాధితులకు ట్రీట్​మెంట్​అందించేందుకు హైదరాబాద్​లో మెంటల్​హాస్పిటల్​ఉన్నప్పటికీ పెరుగుతున్న మానసిక రోగుల అవసరాలకు సరిపోవడం లేదు. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మెంటల్​హెల్త్​కు సంబంధించి సరైన హాస్పిటల్స్​లేకపోవడంతో పేషెంట్స్​ను వరంగల్ ఎంజీఎంకే తీసుకువస్తున్నారు.  ఈ విభాగానికి సంబంధించి ఎంజీఎంలో ప్రతిరోజూ సగటున 80 నుంచి 100 ఓపీ నమోదు అవుతోంది. అందులో కనీసం 10 మందికి ఐపీ సేవలు అవసరం అవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఈ పేషెంట్ల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోందని, అందులో గంజాయి వల్ల సఫర్​ అవుతున్నవారే ఎక్కువగా ఉంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు.

100 బెడ్ల హాస్పిటల్​ మంజూరు
చాలామంది ఆల్కహాల్, గంజాయికి బానిసలై ప్రాణాలు కోల్పోతున్నారని, మెంటల్​ హెల్త్​ఇన్​ స్టిట్యూట్​ఏర్పాటు అవసరాన్ని ప్రస్తావిస్తూ 2017 అక్టోబర్​లో అప్పటి కేఎంసీ ప్రిన్సిపల్, ప్రస్తుత ఎంజీఎం సూపరింటెండెంట్​ డా.వి.చంద్రశేఖర్​ కేంద్రానికి ప్రపోజల్స్​పంపించారు. అప్పటికే కేఎంసీ ఆవరణలో కన్​స్ట్రక్ట్​అవుతున్న పీఎంఎస్ఎస్​వై సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్​ ఎదురుగా ఉన్న స్థలాన్ని ప్రతిపాదించారు. అదే నెల కేంద్రం నుంచి పిలుపురావడంతో ఇక్కడి ఆఫీసర్లు వెళ్లి హాస్పిటల్​ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. దీంతో 2018 జనవరి ఫస్ట్​వీక్ లో కేంద్ర కుటుంబ ఆరోగ్య, సంక్షేమశాఖ ఆఫీసర్లు సిటీకి వచ్చారు. కేఎంసీ ఆవరణలో ఆఫీసర్లు ప్రతిపాదించిన స్థలాన్ని చూసి మెంటల్​హెల్త్ ఇన్​స్టిట్యూట్​కు అనుకూలంగా రిపోర్ట్​ ఇచ్చారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం హాస్పిటల్​నిర్మాణానికి గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. 

రాష్ట్రం పైసా పెట్టలే
మెంటల్​హెల్త్​ఇన్ స్టిట్యూట్​ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించాల్సి ఉంది.  హాస్పిటల్​నిర్మాణానికి మొత్తం రూ.33 కోట్లు అవసరం కాగా.. అందులో 70 శాతం కేంద్రం, మిగతా 30 శాతం రాష్ట్రం భరించాల్సి ఉంది. అంటే మొత్తం బడ్జెట్​లో రూ.23 కోట్లు కేంద్రం వాటా కాగా, మిగతా రూ.10 కోట్లు రాష్ట్రం చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు 2018 ఫిబ్రవరిలోనే సెంట్రల్​ గవర్నమెంట్ హాస్పిటల్​ నిర్మాణం కోసం మొదటి విడత రూ.17 కోట్లు రిలీజ్​ చేసింది. వాటిని వినియోగించిన తరువాత మిగతా ఫండ్స్​ రిలీజ్​చేస్తామని అప్పట్లో చెప్పినప్పటికీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అడుగు ముందుకు వేయలేదు. దీంతో మెంటల్​హాస్పిటల్​ కాగితాల్లోనే ఆగిపోయింది. ఈ హాస్పిటల్​ఏర్పాటైతే పిడియాట్రిక్, అడల్ట్, ఎమర్జెన్సీ, ఫొరెన్సిక్ సైకియాట్రి, ఇలా వివిధ రకాల మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.