లక్షలాది మంది రైతులతో, కోటికి పైగా ఎకరాలతో విస్తారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ శాఖ మొండి పట్టుదలతో, నిరంతర పరిశ్రమతో పనిచేయాలన్నారు సీఎం కేసీఆర్. వ్యవసాయ శాఖపై బుధవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు సీఎం.
సంప్రదాయక వ్యవసాయ పద్ధతుల స్థానంలో గొప్ప పరివర్తన రావాలన్నారు సీఎం కేసీఆర్. అసంఘటిత రంగంలో ఉన్న రైతులకు సంఘటిత శక్తిలోని బలమెంతో చూపించేందుకు, మేలైన సాగు విధానాలు, లాభదాయక పద్ధతులు చెప్పేందుకు వ్యవసాయ శాఖ మార్గదర్శనం చేయాలని, నాయకత్వం వహించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్నదని, దానికి తగ్గట్టు వ్యవసాయ శాఖ కూడా సంస్థాగతంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. అవసరమైతే వ్యవసాయ శాఖకు మరిన్ని పోస్టులు మంజూరు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో రాష్ట్రంలో రైతులు నూటికి నూరు శాతం చెప్పిన పంటలే వేశారని, ఏ గుంటలో ఏ రైతు ఏ పంట పండిస్తున్నారో ఖచ్చితమైన వివరాలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడానికి స్వతంత్ర్య భారతదేశంలో గతంలో ఎన్నడూ, ఎక్కడా జరగనంత ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోందన్నారు సీఎం కేసీఆర్ . కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మాణం జరిపి, రైతులకు ఉచితంగా సాగునీరు అందిస్తున్నామన్నారు. ఒక్క రూపాయి కూడా భూమి శిస్తు తీసుకోవద్దనే లక్ష్యంతో నీటి తీరువా విధానాన్నే రద్దు చేయడంతో పాటు పాత బకాయిలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల కరెంటును ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు. వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడిని రైతుబంధు పథకం కింద ప్రతీ పంటకు తమ ఖాతాల్లోనే జమ చేస్తోందన్నారు. ఏ కారణం చేత రైతు మరణించినా అతడి కుటుంబానికి 5 లక్షల రైతు బీమా అందిస్తోందని తెలిపారు. కరోనా కష్ట కాలంలోనూ రైతులు పండించిన ప్రతీ పంటను నూటికి నూరుశాతం ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులను సంఘటిత పరిచేందుకు ప్రభుత్వమే పూనుకుని రైతుబంధు సమితులు ఏర్పాటు చేసిందని చెప్పారు. క్లస్టర్ల వారీగా నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణం కూడా మూడు నెలల్లో పూర్తి అవుతుందని…. రైతు వేదికలు రైతుల చైతన్యానికి వేదికలుగా మారుతాయన్నారు. సీఎంతో పాటు ఎవరైనా సరే నేరుగా రైతులతో మాట్లాడే వెసులుబాటు కలుగుతుందని వివరించారు సీఎం కేసీఆర్.
తెలంగాణలో వ్యవసాయం లాభసాటిగా మారాలన్నారు కేసీఆర్. అంతిమంగా రైతులు ధనిక రైతులుగా మారాలని… అందుకోసమే ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాలంటే వ్యవసాయ శాఖ మరింత క్రియాశీలం కావాలని సూచించారు. సంప్రదాయక వ్యవసాయ పద్దతుల స్థానంలో ఆధునిక విధానాలు రావాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులను అధ్యయనం చేసి, వాటిని తెలంగాణలో అమలు చేయాలని చెప్పారు. వ్యవసాయ రంగంలో గొప్ప పరివర్తన రావాలని.. వ్యవసాయంలో ఆధునిక సాగు పద్ధతులు రావాలన్నారు. యాంత్రీకరణ పెరగాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సింగిల్ పిక్ క్రాప్స్ వచ్చాయని… వాటిని అధ్యయనం చేయాలని చెప్పారు. తెలంగాణ వాతావరణానికి అనుగుణంగా ఏ పంటలు పండుతాయో తెలుసుకోవాలని సూచించారు. వాటి సాగు పద్దతులు తెలుసుకోవాలన్నారు. అధికారులు, రైతులు తరచూ విజ్ఞాన యాత్రలు చేయాలని…. రాష్ట్రంలో, దేశంలో, ఇతర దేశాల్లో మెరుగైన సాగు పద్ధతులను అధ్యయనం చేసి రావాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ పంటకు డిమాండ్ ఉందో తెలుసుకోవాలన్నారు. మార్కెట్ ను అధ్యయనం చేయడంతో పాటు.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా నాణ్యమైన, మేలు రకమైన కూరగాయలు, ఆహార పదార్థాలు వారికి అందించేలా పంటలు సాగు చేయాలన్నారు. ఈ పనుల కోసం వ్యవసాయ శాఖ ప్రత్యేక విభాగాలను పెట్టి, ఒక్కో విభాగానికి ఒక్కో అడిషనల్ డైరెక్టర్ ను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను నియమించామని చెప్పారు. పెరిగిన విస్తీర్ణం, అవసరాల మేరకు అవసరమనుకుంటే అదనంగా ఎఇవోలను నియమించుకోవాలన్నారు. వ్యవసాయ శాఖను మారిన పరిస్థితులకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించాలి. ఉద్యానవన శాఖను కూడా ప్రక్షాళన చేయాలన్నారు. దాని పరిధిలో ఏఏ పంటలు ఉంచాలో నిర్ణయించాలని చెప్పారు సీఎం కేసీఆర్.
తెలంగాణ రైతులు మార్పును అందిపుచ్చుకునే చైతన్యం కలిగిన వారు. అందుకే నియంత్రిత పద్ధతిలో సాగును వందకు వంద శాతం అమలు చేశారని చెప్పారు సీఎం. వానాకాలంలో మక్కలు వేయడం లాభదాయకం కాదు అంటే, ఎవ్వరూ మక్కలు వేయలేదన్నారు. ప్రభుత్వ ప్రయత్నాలు తమ కోసమే అని రైతులు గ్రహించారన్నారు. కాబట్టి రైతులకు సరైన మార్గదర్శనం చేస్తే, వ్యవసాయాన్ని తప్పక లాభదాయకంగా మార్చవచ్చన్నారు. ఏ గుంటలో ఏ రైతు ఏ పంట వేశాడనే లెక్కలు తీయాలి. అది చాలా ముఖ్యమన్నారు. అంతేకాదు విపత్తుల వల్ల ఏర్పడే ఆకలి సమస్య చాలా దారుణమైనదన్నారు సీఎం. యుద్ధం కన్నా ఆకలి ఎక్కువ విలయం సృష్టిస్తుందని… కాబట్టి దేశం ఎప్పుడూ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కొరత లేకుండా స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. 135 కోట్ల మంది ప్రజలున్న దేశానికి మరే దేశం తిండి పెట్ట జాలదన్నారు. కాబట్టి మన ప్రజలకు మనమే తిండి పెట్టే విధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. దేశం స్వయం పోషకం కావాలని కోరారు. కేవలం ఆహారమే కాకుండా ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రయత్నం చేయాలన్నారు.
ప్రగతి భవన్ లో సీఎం నిర్వహించిన సమీక్ష లో వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్థన్ రెడ్డి, అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.

