తొలి విడతలో పది మందికి పదవులు!

తొలి విడతలో పది మందికి పదవులు!
  •      నామినేటెడ్ పోస్టుల భర్తీకి లిస్ట్ రెడీ చేసిన కాంగ్రెస్
  •     అధిష్టానంతో చర్చించాక ప్రకటించనున్న నేతలు

హైదరాబాద్, వెలుగు: నామినేటెడ్ పదవుల భర్తీలో తొలి విడతగా పది మందికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. సంక్రాంతి పండుగ తర్వాత ఆయా పదవులు దక్కిన నేతల పేర్లను ప్రకటించనున్నట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికల్లోపు ఈ పోస్టులను భర్తీ చేయాలని, పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశం ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే 10 నుంచి 15 మందితో ఓ లిస్టును తయారు చేసినట్టు కాంగ్రెస్ కీలక నేత ఒకరు తెలిపారు. 

శుక్రవారం రాత్రి సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్ దీపాదాస్ మున్షి తదితరులు ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవులకు సంబంధించి కసరత్తు చేసినట్టు చెప్పారు. శనివారం కేసీ వేణుగోపాల్‌‌తో భేటీ సందర్భంగా ఆ లిస్టును సీఎం రేవంత్, దీపాదాస్ అందజేశారని తెలుస్తున్నది. ఆ లిస్టుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీలతో చర్చించి ఫైనల్ చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆశావహులు

హైకమాండ్‌‌కు అందజేసిన లిస్టులో తమ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు కొందరు నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగానే లాబీయింగ్ చేస్తున్నట్టు పార్టీ నేతలు చెప్పారు. ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల కోసం రాష్ట్ర సచివాలయం, గాంధీభవన్ చుట్టూ ఆశావహులు తిరుగుతున్నారు. సీఎం, మంత్రులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. పార్టీకి చెందిన ఆర్గనైజేషన్ల చైర్మన్లు, పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాల నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్లను వదులుకున్న తమకు తొలి విడతలోనే అవకాశం దక్కుతుందని కొందరు నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.