జీడిమెట్ల, వెలుగు: పందికొక్కులు చంపడానికి పెట్టిన ఎలుకల మందు నుంచి వెలువడిన విషవాయువులు పీల్చి ఓ చిన్నారి మృత్యువాత పడ్డ ఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం… శ్రీకాకుళం జిల్లా కొత్త వీధికి చెందిన శ్యామ్ కుమార్(34) బతుకుదెరువుకోసం వచ్చి కొంపల్లిలో ఉంటూ హమాలీగా పని చేస్తున్నాడు.
ఈ నెల 2న సాయంత్రం 5 గంటలకు తన ఇంటి గడప ముందు పంది కొక్కుల కన్నం ఉండటంతో అందులో ఎలుకల మందు పెట్టి రాత్రి పడుకున్నాడు. ఎలుకల మందు ప్రభావంతో గదిలోని వాయువులు విషపూరితంగా మారాయి. గదిలోని వారు ఆపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఉదయం గమనించిన పక్కింటివారు బాధితులను కొంపల్లిలోని ప్రైవేటు ఆసుప్రతికి తరలించారు. శ్యామ్కుమార్, అతని భార్య శాంతి కోలుకున్నారు. కూతురు అనిత(4) శుక్రవారం రాత్రి చనిపోయింది.