ఏడేండ్లలో దాచిన జీవోలు 77 వేలు

ఏడేండ్లలో దాచిన జీవోలు 77 వేలు

మొత్తం జీవోలు 1,50,334 .. వెబ్​సైట్​లో పెట్టినవి 72 వేలే
కీలక జీవోలన్నీ దాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
టెండర్లు, భూకేటాయింపులు, ఇరిగేషన్​ అంచనాలు అంతా రహస్యమే
ఉత్తుత్తివే  వెబ్​సైట్​లో పెడుతున్న అధికారులు టీ, స్నాక్స్, కరెంట్ బిల్లులు, ఫోన్​ బిల్లులు, 
మెడికల్​ బిల్లుల ఉత్తర్వులే ఎక్కువ కన్పిస్తున్నయ్​ కేసీఆర్​, కేటీఆర్ డిపార్ట్​మెంట్లలో 
మస్తు జీవోలు బయటకొస్తలే 

రాష్ట్ర సర్కార్​ వేలకు వేల జీవోలను దాచిపెడుతోంది. కీలకమైన జీవోలు వెబ్​సైట్​లో కనిపించకుండా చేస్తోంది. చాయ్​లు, స్నాక్స్, కరెంట్ బిల్లులు, ఫోన్​ బిల్లులు, మెడికల్​ బిల్లులకు సంబంధించిన చిన్నాచితక జీవోలే ఎక్కువగా వెబ్​సైట్​లో పెడుతోంది. ఏడేండ్లలో ఇచ్చిన జీవోల్లో సగానికి పైగా బయటకు రాలేదు. ‘కాన్ఫిడెన్షియల్ అండ్​ ఇంటర్నల్​’ పేరుతో అన్ని డిపార్ట్​మెంట్లలోనూ ముఖ్యమైన ఉత్తర్వులు రహస్యంగా ఉంచుతున్నారు.
    

హైదరాబాద్, వెలుగు: ఒకదిక్కు పరిపాలన అంతా పారదర్శకంగా జరుగుతున్నదని  చెప్తున్న సర్కారు.. మరోదిక్కు జీవోలు దాస్తోంది. 2014 జూన్ 2  నుంచి ఈ నెల 17 వరకు రాష్ట్ర సర్కార్​ 1,50,334 జీవోలు ఇచ్చింది. ఇందులో 72,786 మాత్రమే వెబ్​సైట్​లో ఉన్నాయి. 77,548 జీవోలు పత్తా లేవు. goir.telangana.gov.in వెబ్​సైట్​లో పెట్టిన జీవోల్లో  కొన్నింటికి ఏ సమాచారం లేకుండా (బ్లాంక్​గా) అప్​లోడ్​ చేశారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సీఎం కేసీఆర్​ ప్రత్యేక విమానంలో మంత్రులు, ఉన్నతాధికారుల టీంతో కలిసి చైనాలో పర్యటించారు. అప్పుడు ఆ పర్యటనకు సంబంధించి ఎంత ఖర్చయిందనే  వివరాలతో ఒక జీవో వెబ్​సైట్​లో పెట్టారు. దానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో జీవోలు వెబ్​సైట్​లో పెట్టడం మానేశారు. దీంతో అప్పట్లోనే హైకోర్టు.. జీవోలను వెబ్​సైట్​లో పెట్టాల్సిందేనని ఆదేశించింది. అయితే.. నాటి నుంచి సాధారణ ఉత్తర్వులను వెబ్​సైట్​లో పెడుతూ కీలకమైన వాటిని ‘కాన్ఫిడెన్షియల్ అండ్​ ఇంటర్నల్’​ పేరుతో ప్రభుత్వం దాచేస్తోంది. ఇలా దాస్తున్న జీవోలు ఆయా డిపార్ట్​మెంట్ల హెచ్​వోడీలు, సెక్షన్​ ఆఫీసర్లు మాత్రమే చూసుకునే అవకాశం ఉంటుంది. సాధారణ ప్రజలకు ఇవి అందుబాటులో ఉండటం లేదు. 
కేసీఆర్, కేటీఆర్​ డిపార్ట్​మెంట్లలోనే ఎక్కువ
ప్రభుత్వం ఏం చేస్తోంది? ఏ విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది? టెండర్లు ఏ రేటుకు ఎవరికి దక్కుతున్నయ్​? ఎక్కడ ఏ కంపెనీకి భూములను ఎంత ధరకు కేటాయిస్తున్నరు? వంటి వివరాలతో  కూడిన జీవోలేవీ ప్రభుత్వం వెబ్​సైట్​లో పెట్టట్లేదు.  టెండర్ల పద్ధతిలో ఫండ్స్​ను ఎక్కువగా ఖర్చు చేసే డిపార్ట్​మెంట్లలోని జీవోలే బయటకు రావడం లేదు. కీలక ఆఫీసర్ల ట్రాన్స్​ఫర్ల ఉత్తర్వులు కూడా వెబ్​సైట్​లో పెట్టడం లేదు. సీఎం కేసీఆర్​ చూస్తున్న ఇరిగేషన్, జీఏడీ, రెవెన్యూ శాఖలతోపాటు మంత్రి కేటీఆర్​ చూస్తున్న మున్సిపల్​ అడ్మినిస్ట్రేటివ్​, ఐటీ, ఇండస్ట్రీలకు సంబంధించిన జీవోలనే ఎక్కువగా దాస్తున్నారు.  ఆ తర్వాత ఆర్​ అండ్​ బీ, ఎనర్జీ డిపార్ట్​మెంట్లవి ఉన్నాయి. వీటిల్లోనే ఎక్కువగా టెండర్లు, నిధుల ఖర్చుతో పాటు, భూ కేటాయింపులు, మిషన్ భగీరథ, మిషన్​ కాకతీయ,  కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన జీవోలు, ప్రజాప్రతినిధులకు భూ కేటాయింపుల ఉత్తర్వులు ఉంటాయి. ఆఫీసర్లకు ఇచ్చే ఎక్స్​టెన్షన్, కలెక్టర్​ కార్యాలయాల నిర్మాణాలు, వెహికల్స్​ కొనుగోలు, కరెంట్​ కొనుగోళ్లకు సంబంధించిన జీవోలు కూడా ప్రభుత్వం దాచేస్తోంది. సర్కార్​ తీసుకునే నిర్ణయాలు, పాలసీలకు ఎక్కడైనా  ఇబ్బంది వస్తుందని భావిస్తే వాటి తాలూకు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగానే వెబ్​సైట్​లో పెట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మంత్రి కేటీఆర్​కు సంబంధించిన మున్సిపల్​ అడ్మినిస్ట్రేటివ్​ డిపార్ట్​మెంట్​ ఈ ఏడాది వందల సంఖ్యలో ఉత్తర్వులు రిలీజ్​ చేస్తే అందులో మూడు మాత్రమే ఆన్​లైన్​లో ఉన్నాయి. పట్టణ ప్రగతి, లే ఔట్లకు సంబంధించి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ వాటిని ఆన్​లైన్​లో పెట్టలేదు. ఇక ఇండస్ట్రీస్ అండ్​ కామర్స్​ డిపార్ట్​మెంట్​కు సంబంధించి ఈ ఏడాది 28 జీవోలు అందుబాటులో ఉంచారు. 2014 నుంచి 2019 వరకు మున్సిపల్​ అడ్మినిస్ర్టేటివ్​ అండ్​ అర్బన్​ డెవలప్​మెంట్​లో  5,359 జీవోలు ఇస్తే.. అందులో 1,540 మాత్రమే పెట్టి.. మిగతా 3,799 దాచారు. ఇండస్ర్టీస్​, కామర్స్​, మైనింగ్​ డిపార్ట్​మెంట్లలో 2014 నుంచి 2019 వరకు  2,009 జీవోలు ఇస్తే.. ఇందులో  670 జీవోలు రహస్యంగా ఉంచారు. ఇవన్నీ బడ్జెట్  రిలీజ్​ ఆర్డర్​కు సంబంధించినవే.
ఒక్క ఏడాదిలో ఇచ్చే జీవోలు 20వేల పైనే
తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షా 50 వేల 334 జీవోలు రిలీజ్​ అయ్యాయి. ఈ లెక్కన ప్రతి ఏడాది యావరేజ్​గా విడుదల చేస్తున్న జీవోలు సంఖ్య 21 వేలుగా ఉంటోంది. అదే వెబ్​సైట్​లో పెట్టిన జీవోలు మాత్రం అన్ని లేవు.  2014  జూన్​ 2వ తేదీ నుంచి డిసెంబర్​ 31 వరకు 10,282 జీవోలు వెబ్​సైట్​లో పెట్టారు. 2015లో 21,702 జీవోలు,  2016లో 13, 249 జీవోలు, 2017లో  8761 జీవోలు అప్ లోడ్ చేశారు. 2018లో 6,858 జీవోలు, 2019లో 4,701 జీవోలు, 2020లో  4,207 జీవోలు, ఈ ఏడాది ఈ నెల 17 వరకు 3,026 జీవోలు అప్ లోడ్  చేశారు. 
చిన్నా చితక జీవోలే
ప్రభుత్వం వెబ్​సైట్​లో పెడుతున్న జీవోల్లో ఎక్కువగా ప్రజలకు పెద్దగా ఉపయోగపడనివే ఉంటున్నాయి. ఉద్యోగుల మెడికల్​ బిల్లులు, లీవ్​లు, సెల్​ఫోన్​ బిల్లుల చెల్లింపులు, ఆయా డిపార్ట్​మెంట్లలో నిర్వహణ ఖర్చులు, ఔట్‌‌సోర్సింగ్‌‌ సిబ్బంది విధుల కొనసాగింపు వంటి వాటికి సంబంధించినవే కనిపిస్తున్నాయి. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 4 (1) (సి) ప్రకారం ప్రభుత్వం ప్రతి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అందులో భాగంగానే జీవోఐఆర్​ వెబ్​సైట్​ ఉమ్మడి ఏపీలో ఏర్పాటు చేశారు.