ప్రియునితో కలసి తండ్రిని చంపించిన కూతురు

ప్రియునితో కలసి తండ్రిని చంపించిన కూతురు
  • జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తాళ్ల ధర్మారం గ్రామంలో ఘటన

జగిత్యాల: తన అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియునితో కలసి కన్నతండ్రినే చంపించిందో కూతురు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తాళ్ల ధర్మారం గ్రామంలో జరిగిందీ దారుణ ఘటన. ఈనెల 11వ తేదీన జరిగిన హత్య కేసును సవాల్ గా తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు 5 రోజుల్లోనే మర్డర్ మిస్టరీని ఛేదించారు. ఈ  ఘాతుకానికి పాల్పడింది కూతురేనని గుర్తించి.. ఆమెతోపాటు.. ఆమె ప్రియుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి.

ఈనెల 11న బీర్పూర్ మండలం తాళ్ల ధర్మారం గ్రామం శివారులో జూపెళ్ళి నర్సయ్య(65) అనే వృద్ధుని హత్య జరిగింది. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానితుల వివరాల కోసం కుమార్తె సత్తవ్వను ప్రశ్నించారు. పొంతనలేని రీతిలో జవాబులివ్వడంతో ఆమెను కూడా అనుమానితుల జాబితాలో చేర్చి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఆమెనే హంతకురాలని గుర్తించారు. ఆమెకు సహకరించి హత్య చేసిన ప్రధాన నిందితుడు ఆమె ప్రియుడు బార్ల గంగాధర్ (43) అని గుర్తించి ఇద్దరినీ అరెస్టు చేశారు. కుటుంబ కలహాలకు తోడు తన అక్రమ సంబంధానికి తండ్రి అడ్డు వస్తున్నాడనే కారణంగా కూతురు సత్తవ్వ ఈ హత్యకు ప్రణాళిక రచించినట్లు సీఐ కృష్ణకుమార్ వెల్లడించారు. తన ప్రియునితో కలిసి కూతురే ఈ దారుణం చేయించందని చెప్పారు. నిందితులిద్దర్నీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.