- బీటెక్ స్టూడెంట్ మృతిపై ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాల మండిపాటు
- వనపర్తి జిల్లా ఆస్పత్రి ముందు ఆందోళన
- బీజేపీ నేత బంగారు శ్రుతిని తిట్టిన మున్సిపల్ చైర్మన్
- కేసు పెడతానని హెచ్చరించిన శ్రుతి
వనపర్తి, వెలుగు: దళిత బీటెక్ స్టూడెంట్ లావణ్య ఆత్మహత్యకు సర్కారు తీరే కారణమని ప్రతిపక్షాలు, స్టూడెంట్, నిరుద్యోగ సంఘాలు మండిపడ్డాయి. మంగళవారం వనపర్తి జిల్లా ఆస్పత్రిలో లావణ్య మృతదేహానికి పోస్ట్మార్టం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్టీపీ, వివిధ స్టూడెంట్ సంఘాలు కలిసి ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగాయి. ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు నేతలు నిరసన చేపట్టారు. సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్లే లావణ్య ఆత్మహత్య చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లావణ్య మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఆమె కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వడంతో పాటు టైంకు స్టూడెంట్లకు స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవ్వాలన్నారు. లావణ్య మృతదేహాన్ని మార్చురీ నుంచి బయటకు తీసుకొచ్చి రోడ్డుపై ఆందోళన చేసేందుకు యువజన కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగి కొందరికి గాయాలయ్యాయి. పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి లావణ్య మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
బంగారు శృతిని తిట్టిన మున్సిపల్ చైర్మన్
బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బంగారు శృతిని వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్లు తిట్టారు. ఓ స్టూడెంట్ చనిపోతే మంత్రి పేరిట చైర్మన్ కేవలం రూ.5 వేల సాయమే చేయడమేంటని ఆమె ప్రశ్నించడంతో.. వారిద్దరు తిట్ల దండకం అందుకున్నారు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దళితులు, మహిళలపై సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలకు గౌరవం లేదని మండిపడ్డారు. దళితులకు సీఎం మొండి చెయ్యి చూపించడం వల్లే లావణ్య కుటుంబం అప్పులపాలైందని విమర్శించారు. కూతురు చదువుకు ఫీజు కట్టలేని స్థితిలో ఆ కుటుంబం ఉందన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్ ఇవ్వలేదన్నారు. చదువుకున్నా ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం కోల్పోయే లావణ్య ప్రాణాలు తీసుకుందన్నారు. స్టూడెంట్లకు సర్కార్ స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్లు చెల్లించడం లేదన్నారు.