హైదరాబాద్, వెలుగు: వివిధ కోర్సుల్లో ఇచ్చే టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ (టీటీసీ)లకు సంబంధించి విడుదలైన నోటిఫికేషన్ పత్తాలేకుండా పోయింది. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినా ఎగ్జామ్ పెట్టకుండా, ట్రైనింగ్ ఇవ్వకుండా సర్కారు మరిచిపోయింది. ఇటీవల గురుకులాల్లో ఆర్థిక శాఖ అనుమతించిన పలు పోస్టులకు టీటీసీ తప్పనిసరి. కానీ 2019 నుంచి సర్టిఫికెట్ ఇవ్వకుండా సర్కారు నిర్లక్ష్యం చేయడంతో అభ్యర్థులు తీవ్ర బ్బందులు పడుతున్నారు. సర్టిఫికెట్ కోసం వేల మంది అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
వివిధ కోర్సుల్లో ట్రైనింగ్
చేనేత, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, డ్రాయింగ్ లాంటి కోర్సుల్లో రాష్ట్ర పరీక్షల విభాగం సర్టిఫికెట్ ఇస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా టీటీసీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఏడో తరగతి చదివిన వారు అర్హులు. దీనికి ప్రత్యేకంగా ఎగ్జామ్ ఉంటుంది. మొత్తంగా ఐదు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అందులో క్వాలిఫై అయితే 42 రోజులపాటు ట్రెయినింగ్ ఇస్తారు. ఆ తర్వాత టీటీసీ సర్టిఫికెట్ అందజేస్తారు. ఇందులో లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ ఉంటాయి. లోయర్ గ్రేడ్ చేసిన తర్వాత హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ ఇస్తారు.
2019 నుంచి ఇస్తలె
రాష్ట్ర ప్రభుత్వం 2019 మే15వ తేదీన టీటీసీ నోఫికేషన్ రిలీజ్ చేసింది. దరఖాస్తులు తీసుకుంది. కానీ ఎగ్జామ్ మాత్రం పెట్టలేదు. ఆ తర్వాత కరోనా అని సాకులు చెబుతూ పట్టించుకోలేదు. గతేడాది అక్టోబర్ 22న మరో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాన్ని కూడా పక్కనపడేశారు. దీంతో మూడేండ్ల నుంచి సర్టిఫికెట్లు రావడంలేదు. ఇటీవల గురుకులాల్లో 10 వేల పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో 400 దాకా ఆర్ట్, క్రాఫ్ట్, ఎంబ్రాయిడరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. వీటి కోసం వేల మంది దరఖాస్తు చేసుకోనున్నారు. అయితే టీటీసీ లేకపోవడంతో ఇబ్బందులు తప్పవని, జాబ్కు అర్హత ఉండదని అభ్యర్థులు వాపోతున్నారు. సర్కారు స్పందించి దీనిపై దృష్టిసారించాలని కోరుతున్నారు.
వీలైనంత త్వరగా ఇయ్యాలె
రాష్ట్ర ప్రభుత్వం టీటీసీ సర్టిఫికెట్ ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. 2019, 2021లో నోటిఫికేషన్లు ఇచ్చినా పట్టించుకోవడంలేదు. గురుకులాల్లో ఆర్ట్, క్రాఫ్ట్, ఎంబ్రాయిడరీ టీచర్ ఉద్యోగాలకు టీటీసీ తప్పనిసరి. కానీ మూడేండ్లుగా సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో ఏం చేయాల్నో అర్థం కావడంలేదు. సర్కారు స్పందించి వీలైనంత త్వరగా సర్టిఫికెట్లు ఇచ్చేలా చొరవ చూపాలి.
- విజయ్, అభ్యర్థి, నల్లగొండ