T20 World Cup 2024: భారత వరల్డ్ కప్ జెర్సీకి కాషాయ రంగు.. నెట్టింట ట్రోలింగ్

T20 World Cup 2024: భారత వరల్డ్ కప్ జెర్సీకి కాషాయ రంగు.. నెట్టింట ట్రోలింగ్

ప్రతిష్ఠాత్మక‌ ఐసీసీ టోర్నీ టీ20 వరల్డ్ కప్‌కి టీమిండయా కొత్త జెర్సీ రివీల్ చేశారు. సోమ‌వారం(మే 06) ఇండియా టీమ్ స్పాన్సర్ అడిడాస్ ఇండియా.. కొత్త జెర్సీని ఆవిష్కరించింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ, జ‌డేజా, కుల్దీప్ యాద‌వ్‌లు చూస్తుండ‌గా హెలిక్యాప్టర్ ఎంట్రీతో జెర్సీని విడుద‌ల చేశారు. అయితే, ఈసారి వరల్డ్ కప్ జెర్సీకి కాస్త కాషాయ రంగు అంటించారు.

ప్రపంచ క‌ప్ కోసం రూపొందించిన జెర్సీ గతంలో పోలిస్తే భిన్నంగా ఉంది. పూర్తి బ్లూ రంగు కాకుండా.. ఈసారి జెర్సీలో బ్లూతో పాటు కాషాయం రంగు ఉంది. భుజాల‌పై కాషాయ రంగు, తెలుపు రంగు అడ్డ గీత‌లు.. మిగ‌తా భాగ‌మంతా నీలి రంగుతో ఉంది. ఇక అడిడాస్​ లోగో జెర్సీ కుడివైపు, బీసీసీఐ లోగో ఎడమవైపు ఉంది. చూడటానికి జెర్సీ చూడముచ్చటగా ఉన్నా.. నెట్టింట మాత్రం నెగటివ్ ట్రోలింగ్ ఎదురవుతోంది.

కొందరు జెర్సీ బాగుందంటూ ప్రశంసిస్తుండగా.. మరికొందరు మాత్రం ఆ కలర్‌ కాంబినేషన్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ సమయం కదా..! కాషాయ రంగు ఉంటుందని అంచనా వేశామంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరైతే.. బట్టలు వాష్ చేయడానికి ఉపయోగించే సర్ఫ్ ఎక్సల్ కవర్‌లా ఉందని కామెంట్లు పెడుతున్నారు. 

జూన్‌ 2 నుంచి టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ప్రారంభం కానుండగా.. జూన్‌ 5న ఐర్లాండ్‌తో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. రెండేండ్ల క్రితం ఇంగ్లండ్ చేతిలో సెమీ ఫైన‌ల్లో కంగుతిన్న భార‌త్.. ఈసారి కప్పు కొట్టాల‌నే క‌సితో ఉంది.

భార‌త జట్టు: రోహిత్ శ‌ర్మ(కెప్టెన్), య‌శ‌స్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాద‌వ్, విరాట్ కోహ్లీ, రిష‌భ్ పంత్(వికెట్ కీప‌ర్), సంజూ శాంస‌న్(వికెట్ కీప‌ర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, ర‌వీంద్ర జ‌డేజా, అక్షర్ ప‌టేల్, కుల్దీప్ యాద‌వ్, య‌జ్వేంద్ర చాహ‌ల్, అర్ష్‌దీప్ సింగ్, జ‌స్ప్రీత్ బుమ్రా, సిరాజ్‌.

రిజ‌ర్వ్ ఆట‌గాళ్లు: శుభ్‌మ‌న్ గిల్, రింకూ సింగ్, ఖ‌లీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.