ఒకపక్క ప్రపంచ వ్యాప్తంగా పెద్దపెద్ద టెక్నాలజీ కంపెనీలు ఏఐ వెనుక పరిగెడుతూ ఉద్యోగుల ఊచకోత కొనసాగిస్తుంటే ఒక యూరోపియన్ కంపెనీ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ASML తన ఉద్యోగులను ఆకట్టుకునేందుకు భారీ రిటెన్షన్ బోనస్ ప్రకటించింది. ప్రతిభావంతులైన సిబ్బందిని కంపెనీలో కొనసాగించేందుకు తీసుకున్న ఈ నిర్ణయం టెక్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. అర్హత ఉన్న ఉద్యోగులు 2027 నుంచి 2030 వరకు కంపెనీలో కొనసాగితే వారికి రూ.19లక్షలు విలువైన షేర్ బోనస్ అందనుంది.
మూడేళ్లు కొనసాగితే భారీ రివార్డ్..
ASML ప్రకటించిన ఈ ప్రత్యేక బోనస్ 2027 జనవరి 1న మంజూరు కానుంది. అయితే ఉద్యోగులు దానిని పూర్తిగా పొందాలంటే 2030 జనవరి 1 వరకు కంపెనీలో కొనసాగాలి. అంటే దాదాపు 3 సంవత్సరాల పాటు సంస్థతో ప్రయాణం కొనసాగించే ఉద్యోగులకు ఈ ప్రయోజనం లభిస్తుంది. 20వేల డాలర్లను భారత కరెన్సీలో లెక్కిస్తే రూ.19లక్షలు అవుతుంది. అంటే ఒక ఉద్యోగి 3 సంవత్సరాలు కంపెనీలో కొనసాగితే దాదాపు 19 లక్షల రూపాయల విలువైన షేర్ బహుమతి పొందనున్నారు.
ఎందుకు ఇంత పెద్ద బోనస్?
ASML ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న దశలో ఉందని కంపెనీ తెలిపింది. చిప్ తయారీ రంగంలో కీలకమైన లిథోగ్రఫీ టెక్నాలజీ, 3D చిప్ ఆర్కిటెక్చర్, ఏఐ ఆధారిత సిస్టమ్స్, సాఫ్ట్వేర్ అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. కంపెనీ భవిష్యత్ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని గుర్తిస్తూ ప్రపంచవ్యాప్తంగా అర్హత ఉన్న సిబ్బందికి ఈ వన్టైమ్ కండిషనల్ షేర్ అవార్డ్ ఇస్తున్నట్లు ASML వెల్లడించింది.
AI బూమ్తో చిప్ కంపెనీల పోటీ..
ప్రస్తుతం ఏఐ విస్తరణతో సెమీకండక్టర్ రంగంలో నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ క్రమంలో ఉద్యోగులను ఇతర కంపెనీలకు వెళ్లకుండా నిలుపుకోవడానికి టెక్ సంస్థలు ప్రత్యేక బోనస్లు అందిస్తున్నాయి. ASML మాత్రమే కాదు.. ఇతర చిప్ దిగ్గజాలు కూడా ఉద్యోగులకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. సామ్సంగ్ తన ఉద్యోగుల్లో చాలామందికి సుమారు రూ.3కోట్ల 51లక్షల వరకు బోనస్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే SK Hynix కూడా ఉద్యోగులకు సుమారు రూ.4కోట్ల 52 లక్షలు విలువైన బోనస్లు ప్రకటించింది.
టెక్ ఉద్యోగులకు కొత్త ట్రెండ్..
AI, సెమీకండక్టర్ రంగాల్లో పెరుగుతున్న పోటీతో కంపెనీలు ఇప్పుడు కేవలం జీతాలతో కాకుండా షేర్లు, రిటెన్షన్ బోనస్లు, ప్రత్యేక ప్రోత్సాహకాలతో ఉద్యోగులను ఆకర్షిస్తున్నాయి. ASML ప్రకటించిన రూ.19 లక్షల రివార్డ్ కూడా ఉద్యోగుల దీర్ఘకాలిక అనుబంధాన్ని పెంచేందుకు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంగా మారింది.
