ఫేక్​ డాక్యుమెంట్స్​తో బీమా క్లెయిమ్స్

ఫేక్​ డాక్యుమెంట్స్​తో బీమా క్లెయిమ్స్
  • ఏజెంట్లతో కలిసి రూ.18.7 లక్షలు కాజేసిన అసిస్టెంట్​లేబర్​ఆఫీసర్​

  • ఇద్దరి అరెస్ట్.. పరారీలో ఐదుగురు 

హనుమకొండ, వెలుగు: ఫేక్​డాక్యుమెంట్స్​తో లేబర్ ఇన్సూరెన్స్​క్లెయిమ్​చేస్తూ ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్న ముఠాను వరంగల్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. అసిస్టెంట్ లేబర్​ఆఫీసర్​ సహకారంతో దాదాపు రూ.18.7 లక్షలు కాజేసినట్లు గుర్తించి ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేశారు. ఏఎల్​వో సహా ఐదుగురు పరారీలో ఉన్నారు. అరెస్ట్​కు సంబంధించిన వివరాలను వరంగల్ సీపీ డా.తరుణ్​ జోషి శుక్రవారం కమిషనరేట్​ఆఫీస్​లో వెల్లడించారు. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు కార్మికుల కోసం వివిధ పథకాలు అమలు చేస్తోంది. పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందుతుండటంతో నర్సంపేట ఏఎల్​వో మహమ్మద్​అలీ ఫేక్​డాక్యుమెంట్లతో బీమా క్లెయిమ్స్​చేసేందుకు ప్లాన్​ చేశాడు. నెక్కొండకు చెందిన రాపాక వీరభద్రస్వామి, చెన్నారావుపేటకు చెందిన పర్ష రవి, నెక్కొండ మండలం అమీన్ పేటకు చెందిన లావుడ్య నర్సింహ, రెడ్లవాడ ఉపసర్పంచి చందు, వాగ్యనాయక్​తండాకు చెందిన లావుడ్య పులియా, నర్సంపేట మండలం ముత్తోజిపేటకు చెందిన చిందం అశోక్​ను ఏజెంట్లుగా నియమించుకున్నాడు. ఏజెంట్లతో గ్రామాల్లోని నిరుపేదలకు లేబర్​ కార్డ్స్​ ఇప్పించడం స్టార్ట్​ చేశాడు. కార్డు కోసం రూ. 110 తీసుకోవాల్సి ఉండగా.. ఒక్కొక్కరి నుంచి రూ.300 నుంచి రూ.500 వరకు వసూలు చేశారు. తర్వాత సాధారణ, యాక్సిడెంట్ మరణాల లేబర్ ఇన్సురెన్స్, ప్రసూతి, పెండ్లికి ఇచ్చే సహాయం కోసం లబ్ధిదారుల నుంచి అప్లికేషన్లు తీసుకున్నారు. పర్ష రవికి నర్సంపేటలో డీటీపీ సెంటర్​ఉండగా.. అందులో నుంచి అప్లై చేసేవారు.

అర్హత లేకున్నా ఏఎల్​వో అలీ వాటిని అప్రూవ్​చేసి నోడల్​ఆఫీసర్ ద్వారా శాంక్షన్​చేయించేవాడు. ఇటీవల కాలంలో ‘వెలుగు’  పేపర్​లో లేబర్​ బీమా దందాలపై వరుస కథనాలు రావడంతో టాస్క్​ఫోర్స్​పోలీసులు ఈ బాగోతంపై స్పెషల్​ ఫోకస్​పెట్టారు. పక్కా సమాచారంతో రాపాక వీరభద్రస్వామి, పర్ష రవిని అరెస్ట్​ చేశారు.  వారి నుంచి 10 కొత్త అప్లికేషన్స్, మూడు సీపీయూలు, నాలుగు మానిటర్లు, స్మార్ట్​ ఫోన్, రూ. 5 వేలు స్వాధీనం చేసుకున్నారు. 2018 నుంచి ఫేక్​ డాక్యుమెంట్లతో పర్ష రవి డీటీపీ సెంటర్​ నుంచి 23 అప్లికేషన్స్​పెట్టారని, అందులో 9 అప్లికేషన్లను ఎలాంటి ఎంక్వైరీ లేకుండానే అప్రూవ్​ చేసినట్లు గుర్తించారు.  మిగతా 14 ప్రాసెస్​లో ఉన్నాయి. ఇప్పటివరకు రూ.18.70 లక్షల గోల్​మాల్​జరిగినట్లు తేలింది. ఏఎల్​వో అలీ, మిగతా నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు.