తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం మేరకు జీహెచ్ఎంసి పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేస్తోంది. కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం పార్కుల అభివృద్ధితో పాటు కొత్తగా థీమ్ పార్కుల ఏర్పాటుకు అమలు ముమ్మరం చేసింది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ప్రతీ జోన్లో 3 థీమ్ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది. స్టాండింగ్ కమిటీ లో తీసుకున్న నిర్ణయం ప్రకారం జోన్ కు మూడు చొప్పున ఆరు రోజులలో 18 థీమ్ పార్కులు ఏర్పాటు చేసేలా ఆమోదం తెలిపారు. జోనల్ కమిషనర్లు నేపథ్యంలో ఆయా జోన్ల పరిధిలో ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేయాలని గతంలోనే మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దాన కిషోర్ ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు స్థలాల ఎంపిక ప్రక్రియను జోనల్ కమిషనర్లు పూర్తిచేసినట్టు తెలుస్తోంది. ఆరు జోన్ల పరిధిలో 45 స్థలాలను గుర్తించి ఉన్నతాధికారులకు సమర్పించారని సమాచారం. ఆయా స్థలాల్లో ఏర్పాటు చేయనున్న పార్కులకు థీమ్ ల రూపకల్పన జరుగుతోందని ఓ అధికారి తెలిపారు.
ఒక్కో థీమ్ పార్క్ 3 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. 45 థీమ్ పార్కుల కోసం 200 ఎకరాల స్థలం గుర్తించారు. రూ. 40 కోట్లతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. థీమ్ పార్కులు ఏర్పాటును ముమ్మరం చేసి వర్షాకాలం లోపు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం సిటీ పరిధిలో 1,204 పార్కులు ఉన్నాయి. ఇందులో 873 ల్యాండ్ స్కేప్ పార్కులు, 331 ట్రీ పార్క్ లు ఉన్నాయి. వీటితో పాటు నగరంలోని ప్రతి జోన్ పరిధిలో కనీసం ఐదు మేజర్ పార్కులను ఏర్పాటు చేయాలని చర్యలు తీసుకుంటున్నారు.