IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు

IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ గా నిలిచారు.  ఐపీఎల్ లో భాగంగా మే 19వ తేదీ ఆదివారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS)తో జరిగిన చివరి లీగ్ స్టేజ్ గేమ్‌లో  సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఓపెనర్ అభిషేక్ శర్మ అర్థశతకంతో చెలరేగాడు.

ఈ మ్యాచ్ లో 28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66 పరుగులు చేశాడు. కేవలం 21 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. ఈక్రమంలో విరాట్ కోహ్లీ ఎనిమిదేళ్ల రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు.  ఐపీఎల్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా ఇప్పటివరకు విరాట్ కోహ్లీ పేరిట రికార్డు ఉంది. 2016లో కోహ్లీ 38  సిక్సులు బాదాడు. ఇప్పడు ఆ రికార్డు ను బ్రేక్ చేశాడ అభిషేక్. ఈ సీజన్ ఇప్పటివరకు 14 మ్యాచ్ లు ఆడిన అభిషేక్ మొత్తం 41 సిక్సుర్లు బాదాడు. దీంతో ఆల్-టైమ్ రికార్డును నెలకొల్పాడు.

ఇక మ్యాచ్ విషయానిక వస్తే..  సొంతగడ్డపై జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ పై స‌న్‌రైజ‌ర్స్ ఘన విజయం సాధించింది. కింగ్స్ బ్యాటర్లు నిర్ధేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది.  అభిషేక్(66)తోపాటు  త్రిపాఠి(33),   నితీష్ రెడ్డి(37), క్లాసెన్ (42) రాణించారు. ఈ గెలుపుతో ఆరంజ్ ఆర్మీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ప్రభసిమ్రాన్ సింగ్(71; 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), అథర్వ తైడే(46; 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిలీ రోసో(49; 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), జితేశ్ శర్మ (32 నాటౌట్; 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్ 2, కమిన్స్‌, విజయ్‌కాంత్ వియస్కాంత్ ఒక్కో వికెట్ పడగొట్టారు.